దేశంలో ఎక్కువ పన్నులు విధించే రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అని ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆరోపించారు. బాదుడే బాదుడు ఉన్న రాష్ట్రం ఏపీ అని విరుచుకుపడ్డారు. విశాఖలోని తాళ్లవలసలో జరిగిన బాదుడే బాదుడు కార్యక్రమంలో చంద్రబాబు పాల్గొన్నారు. ఏపీ కంటే ఏ రాష్ట్రంలో అధిక పన్నులున్నాయని నిరూపించినా.. తాను రాజకీయాల నుంచి తప్పుకోవడానికి సిద్ధమని బాబు సవాల్ విసిరారు.
జగన్ సర్కార్కు ప్రజలంటే లెక్కలేని తనమని, రాష్ట్రంలో మరిన్ని అరిష్టాలు జరుగుతాయని బాబు విరుచుకుపడ్డారు. ఇప్పటికే 8 లక్షల కోట్ల అప్పులున్నాయని, ఇప్పటికే కేంద్రం జగన్ సర్కార్ను చీవాట్లు పెడుతోందని అన్నారు. ఇంత అప్పులు చేయడం ఏంటని ప్రశ్నించారు.
జగన్కు ఇదే చివరి ఛాన్స్ అని, భవిష్యత్తులో ఇకపై ఆయనకు ఎవరూ ఓటు వేయరని బాబు స్పష్టం చేశారు. జగన్ పాలనలో ప్రజలు నరకయాతన అనుభవిస్తున్నారని విమర్శించారు. ఒక్క ఛాన్స్ అని ఇస్తే, బాదుడే బాదుడు ఉందని బాబు ఫైర్ అయ్యారు. జగన్ పాదయాత్ర చేసింది ప్రజల కోసం కాదని, ఎక్కడెక్కడ భూములు, గనులు ఉన్నాయో… వాటిని చూడడానికి యాత్ర చేశారని ఎద్దేవా చేశారు.
రిషికొండకు వెళ్లి, పర్యటిస్తానంటే సర్కారు పోలీసులను అడ్డంపెట్టి తనను అడ్డుకున్నారని బాబు మండిపడ్డారు. అదేమైనా పాకిస్తానా? అంటూ మండిపడ్డారు. విశాఖ అంటేనే సుందరమైన ప్రాంతమని, అలాంటి రుషికొండ జ్ఞాపకాన్ని చేరిపేసేలా, సీఎం జగన్ కబ్జా చేస్తున్నారని బాబు మండిపడ్డారు.