విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం (Visakhapatnam) జిల్లా మధురవాడలో ఓ తహసీల్దార్ దారుణ హత్యకు గురయ్యాడు. తహసిల్దార్గా బాధ్యతలు చేపట్టిన రోజే ఆయన ఇంట్లోనే దుండగులు చంపేశారు. చినగదిలి రూరల్ తహసీల్దార్గా ఉన్న సనపల రమణయ్య (Tahsildar Ramanaiah) ఎన్నికల నేపథ్యంలో ఇటీవల విజయనగరం జిల్లాలోని బంటుపల్లికి బదిలీ అయ్యారు. శుక్రవారం బాధ్యతలు చేపట్టిన ఆయన కొమ్మాదిలోని తన ఇంటికి చేరుకున్నారు. రాత్రి 10.15 గంటల సమయంలో ఫోన్ రావడంతో కిందకు వచ్చి అపార్ట్మెంట్ గేట్ వద్ద ఓ వ్యక్తిని కలిసినట్లు సీసీటీవీ ఫుటేజ్లో నమోదైంది.
ఈ క్రమంలో ఇద్దరి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ క్రమంలో దుండగుడు తనతో తెచ్చుకున్న ఇనుపరాడ్తో రమణయ్య తలపై దాడిచేసి పరారయ్యాడు. తీవ్రంగా గాయపడిన ఆయన అక్కడికక్కడే కుప్పకూలిపోయారు. గమనించిన స్థానికులు వెంటనే దవాఖానకు తరలించారు. అయితే చికిత్స పొందుతూ శనివారం తెల్లవారుజామున 3 గంటలకు ఆయన మృతి చెందారు.
రమణయ్య సొంతూరు శ్రీకాకుళం జిల్లా మండలం దిమ్మిలాడ. ఆయనకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. రమణయ్య విధుల్లో చేరి పదేండ్లు అవుతున్నది. డిప్యూటీ తహసీల్దార్, తహసీల్దార్, కలెక్టరేట్లో ఏవోగా పనిచేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడి కోసం గాలిస్తున్నారు. తహసీల్దార్ హత్యతో రెవెన్యూ యంత్రాంగం ఉలిక్కిపడింది.