అమరావతి : అనంతపురం జిల్లా తాడిపత్రి పోలీసుల వైఖరిని నిరసిస్తూ మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర రెడ్డి నల్లదుస్తులు ధరించి నిరసన తెలిపారు. పోలీసులు, ప్రభుత్వం కుమ్మకై మున్సిపల్ నిబంధనలు అతి క్రమిస్తున్నారని ఆరోపించారు. ప్రస్తుతం పోలీస్స్టేషన్లోనే కొనసాగిస్తున్న ట్రాఫిక్ పోలీస్స్టేషన్ను ఇతర ప్రాంతంలో నిర్మించడానికి పట్టణంలోని మూడు స్థలాలను మున్సిపల్ కౌన్సిల్ తీర్మానించింది. వీటిలో ఏదేని ఒకటి స్థలంలో ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ భవనానికి స్థల ఎంపిక చేసుకోవాలని సూచించింది.
అయితే మున్సిపల్ సూచించిన స్థలంలో కాకుండా పాత స్థలంలోనే నిబంధనలకు విరుద్ధంగా కొంత స్థలాన్ని ఆక్రమించి భవనం నిర్మాణానికి పోలీసులు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. పోలీసుల చర్యను నిరసిస్తూ ఆయన నల్లదుస్తులు ధరించి , నల్లటి కళ్లద్దాలను పెట్టుకుని , నల్ల రంగు పట్కా ధరించి పోలీస్ స్టేషన్ ఎదుట బైటాయించి నిరసన తెలిపారు.
ఎమ్మెల్యే పెద్దారెడ్డి, డీఎస్పీ చైతన్యలు ప్రజలను మోసం చేస్తున్నారని మండిపడ్డారు. మున్సిపల్ కమిషనర్ను బెదిరించి అనుమతి తీసుకున్నారని ఆరోపించారు. వాస్తవానికి ప్రస్తుతమున్న భవనం 121 అడుగులే ఉండగా 190 అడుగులకు అనుమతులు ఎలా తీసుకుంటారని ప్రశ్నించారు.ట్రాఫిక్ పోలీస్స్టేషన్ భవనం నిర్మాణానికి వ్యతిరేకం కాదని పోలీసులు అవలంభిస్తున్న విధానం సరికాదని ఆరోపించారు.