అమరావతి : న్యాయం కోసం పోలీసు స్టేషన్కు వెళ్లిన వివాహితపై అసభ్యకరంగా ప్రవర్తించిన హోంగార్డును జిల్లా పోలీసు అధికారులు సస్పెండ్ చేసిన ఘటన ఏపీలోని అనంతపురం (Anantapuram ) జిల్లాలో చోటు చేసుకుంది . వివరాలు.. జిల్లాలోని కంబదూర్ మండలానికి చెందిన వివాహిత యువకుడి చేతిలో మోసపోయి ఫిర్యాదు చేసేందుకు పోలీస్ స్టేషన్ ( Police Station ) కు వెళ్లింది. తనకు న్యాయం చేయాలని అభ్యర్థన పెట్టుకుంది.
అయితే అక్కడే విధులు నిర్వర్తిస్తున్న హోంగార్డు ( Home Guard )శివానందం ఆమె పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. దీంతో ఇంటికెళ్లి తల్లిదండ్రుల వద్ద జరిగిన విషయాన్ని వివరించి బోరున విలపించింది. మరుసటి రోజు కుమార్తెతో కలిసి తల్లిదండ్రులు జిల్లా ఎస్పీ శ్రీనివాసరావుకు ఫిర్యాదు చేశారు.
అయితే హోంగార్డుపై అధికారులు చర్యలు తీసుకోక పోవడంతో ఆమె తీవ్ర మనస్తాపానికి గురై విషం తాగి ఆత్మహత్యా యత్నానికి పాల్పడింది. ఆమె కుటుంబ సభ్యులు హుటాహుటిన మెరుగైన వైద్యం కోసం అనంతపురం ఆసుపత్రికి తరలించారు. కాగా జిల్లా ఎస్పీ హోంగార్డును సస్పెండ్ (Suspend ) చేస్తున్నట్లు మంగళవారం ప్రకటించారు.