అమరావతి: సరోగసీ చట్టం–2021, అసిస్టెడ్ రిప్రొడక్టివ్ టెక్నాలజీ చట్టం–2021 ను పకడ్బందీగా అమలు చేసేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రత్యేక బోర్డును ఏర్పాటుచేసింది. అదేవిధంగా రాష్ట్ర, జిల్లా అథారిటీలను కూడా నెలకొల్పింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సరోగసి, కృత్రిమ గర్భధారణ పేరుతో జరుగుతున్న వ్యాపార ధోరణిని అడ్డుకునేందుకు కేంద్ర ప్రభుత్వం గత ఏడాది ఈ చట్టాలను తీసుకొచ్చింది.
ఈ బోర్డుకు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి చైర్పర్సన్గా, వైద్య, ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి వైస్ చైర్మన్గా వ్యవహరిస్తారు. వివిధ విభాగాల కమిషనర్లు, డైరెక్టర్లు, నిపుణులు సభ్యులుగా ఉంటారు. ఈ కమిటీలో సభ్యులుగా శింగనమల ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి, తాడికొండ ఎమ్మెల్యే డాక్టర్ శ్రీదేవి, బద్వేల్ ఎమ్మెల్యే డాక్టర్ దాసరి సుధలను సభ్యులుగా ప్రభుత్వం నియమించింది.
కాగా, రాష్ట్ర అథారిటీకి ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్/డైరెక్టర్ చైర్మన్గా, అదనపు డైరెక్టర్ (ఎంసీహెచ్) వైస్ చైర్మన్గా వ్యవహరిస్తారు. ముగ్గురు సభ్యులు కూడా ఉంటారు. జిల్లా స్థాయిల్లో అథారిటీకి కలెక్టర్ చైర్మన్గా, డీఎంహెచ్వో వైస్ చైర్మన్గా ఉంటారు. మరో ముగ్గురు సభ్యులుంటారు.