ఢిల్లీ: వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ప్రధాన నిందితుడైన దేవిరెడ్డి శివశంకర్రెడ్డికి బెయిల్ ఇచ్చేందుకు సుప్రీంకోర్టు తిరస్కరించింది. బెయిల్ మంజూరుకు ఎలాంటి కారణాలు కనిపించడం లేదని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. ఇదే సమయంలో హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వుల్లో జోక్యం చేసుకోలేమని ధర్మాసనం స్పష్టం చేసింది.
వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ప్రధాన నిందితుడు దేవిరెడ్డి శివశంకర్రెడ్డి దాఖలు చేసిన బెయిల్ పిటిషన్పై సుప్రీంకోర్టు ధర్మాసనం విచారించింది. జస్టిస్ ఎంఆర్ షా, జస్టిస్ కృష్ణమురారి నేతృత్వంలోని ధర్మాసనం శివశంకర్రెడ్డికి బెయిల్ ఇచ్చేందుకు తిరస్కరించింది. బెయిల్ ఇచ్చేందుకు తమకు ఎలాంటి కారణాలు కనిపించడంలేదని కూడా ధర్మాసనం వ్యాఖ్యానించింది. దేవిరెడ్డి తరపున సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వి వాదనలు వినిపించారు. తన పేరుగానీ, తన వివరాలు గానీ ఎక్కడా ఎవరూ ప్రస్తావించలేదని, కేసు ఛార్జిషీటులో కూడా తన పేరు లేదని కోర్టుకు విన్నవించారు.
సాక్ష్యాలను తారుమారు చేసే ఆరోపణలు ఉన్నందున హైకోర్టు బెయిల్ తిరస్కరించిన విషయాన్ని ధర్మాసనంలోని న్యాయమూర్తి ప్రస్తావించగా.. అలాంటి ఆధారాలేవీ ఇంతవరకు బయటపెట్టలేదని, సీబీఐ అదనపు ఛార్జీషీట్లో కూడా తన పేరును ప్రస్తావించలేదని, అప్రూవర్గా మారిన వ్యక్తి కూడా తన పేరును చెప్పలేదని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. కాగా, హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వుల్లో తాము జోక్యం చేసుకోవడానికి ఎలాంటి కారణాలు కనిపించడం లేదని, ప్రస్తుత పరిస్థితుల్లో తాము జోక్యం చేసుకోలేమని ధర్మాసనం స్పష్టం చేస్తూ.. శివశంకర్రెడ్డి బెయిల్ పిటిషన్ను తిరస్కరించింది.