ఒంగోలు : ప్రకాశం జిల్లా మార్కాపురంలో విద్యార్ధిని ఆత్మహత్యాయత్నం కలకలం రేపింది. తన మానసిక పరిస్ధితి సరిగా లేనందున తల్లితండ్రులకు భారం కాకుడదని భావించిన విద్యార్ధిని ఆత్మహత్యాయత్నం చేసింది. సమయానికి పోలీసులు స్పందించి ఆమెను ప్రాణాపాయం నుంచి కాపాడారు.
పల్నాడు జిల్లాలోని మాచర్లకు చెందిన విద్యార్ధిని ప్రకాశం జిల్లా సీఎస్ పురంలో అగ్రికల్చరల్ బీఎస్సీ చదువుతున్నది. థర్డ్ ఇయర్ సెమిస్టర్ పరీక్షలు పూర్తవడంతో కాలేజీకి సెలవులు ఇచ్చారు. ఇంటికి వెళ్లకుండా ఆమె మార్కాపురంలోని ఒక లాడ్జిలో బసచేసింది. తన మానసిక పరిస్థితి సరిగా లేని కారణంగా తనువు చాలించాలనుకుంటున్నానని, తల్లిదండ్రులకు భారం కాకూడదనే ఉద్దేశంతోనే చనిపోతున్నానంటూ నాలుగు పేజీల లేఖ రాసి మాచర్లలో నివసిస్తున్న తండ్రికి వాట్సప్ ద్వారా పంపింది. అనంతరం బ్లేడుతో చేయి కోసుకొని ఆత్మహత్యకు యత్నించింది. కూతురు పంపిన లేఖ చూసిన తండ్రి అప్రమత్తమై.. మార్కాపురం పోలీసులకు సమాచారం ఇచ్చాడు. పోలీసులు లాడ్జి వద్దకు చేరుకునే సరికి ఆ విద్యార్థిని రక్తపు మడుగులో పడి ఉన్నది. ప్రాణాపాయ స్ధితిలో ఉన్న విద్యార్ధినిని వెంటనే మార్కాపురం ప్రభుత్వ దవాఖానాకు తరలించారు. వైద్యులు ప్రస్తుతం ఆమెకు చికిత్స అందిస్తున్నారు.