తిరుమల : తిరుమలలోని సప్తగిరి సత్రాలు, సీఆర్వో కార్యాలయాన్ని టీటీడీ ఈవో జె శ్యామలరావు(TTD EO) , అడిషనల్ ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి, సీవీఎస్వో శ్రీధర్ శనివారం తనిఖీలు చేశారు. సప్తగిరి సత్రాలు వద్ద గదులను (Dormitory rooms ) పరిశీలించి కారిడార్లు, బాత్రూమ్లలో పరిశుభ్రత, స్విచ్బోర్డులు, జలప్రసాదం, పరుపులు, మంచాలు, బెడ్షీట్లను పరిశీలించారు.
గదులను ఆధునీకరించేందుకు వెంటనే చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులకు సూచించారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని, డీప్క్లీనింగ్ చేపట్టాలని అధికారులను ఆదేశించారు. యాత్రికులతో (Piligrims) మాట్లాడి కౌంటర్ల వద్ద గదుల కేటాయింపు ప్రక్రియను పరిశీలించారు. అనంతరం సెంట్రల్ రిసెప్షన్ కార్యాలయంలో భక్తులకు గదుల కేటాయింపు ప్రక్రియను వారు పరిశీలించారు.
ఎలక్ట్రానిక్ డిస్ప్లే బోర్డు, ఇన్ఫర్మేషన్ కియోస్క్లను తనిఖీ చేయడంతోపాటు కర్ణాటక, కళ్లకురిచి నుంచి వచ్చిన భక్తులతో ఈవో మాట్లాడారు. భక్తుల సౌకర్యార్థం తిరుమలలో ఎన్నీ గదులు అందుబాటులో ఉన్నాయనే సమాచారాన్ని ఎప్పటికప్పుడు ప్రదర్శించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. వారి వెంట ఎస్ఈ 2 సత్యనారాయణ, ఈఈలు వేణుగోపాల్, శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.