శ్రీవారి దర్శనానికి భారీగా భక్తులు తరలిరావడంతో సర్వదర్శన టోకెన్ల జారీ కేంద్రాల వద్ద తోపులాట జరిగింది. వేలాది మంది ఒక్కసారిగా తరలివచ్చారు. గోవింద రాజస్వామి సత్రాల దగ్గర తోపులాట జరగడంతో కొందరు గాయాలపాలైనట్లు తెలుస్తోంది. అంతేకాకుండా ఈ తోపులాట వల్ల క్యూలైన్లు కొద్దిగా ధ్వంసమయ్యాయి. ఈ తోపులాట వల్ల కొందరు సొమ్మసిల్లి పడిపోయారు. టీటీడీ అధికారులు సరైన ఏర్పాట్లు చేయడంలో విఫలమయ్యారని భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.గాయపడిన వారిని చికిత్స నిమిత్తమై రుయా ఆస్పత్రికి తరలించామని అధికారులు తెలిపారు.
తోపులాట భారీగా జరగడం, పరిస్థితి అదుపు తప్పడంతో పోలీసులు జోక్యం చేసుకున్నారు. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నించినా లాభం లేకపోయింది. అయితే తమ పిల్లలు ఈ తోపులాటలో తప్పిపోయారని కొందరు తల్లిదండ్రులు పేర్కొంటున్నారు. పిల్లలను ఎత్తుకొని, సర్వదర్శనం టోకెన్ల కోసం లైన్లో నిలబడటంతో తల్లిదండ్రులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. రెండు రోజుల విరామం తర్వాత టీటీడీ సర్వదర్శన టిక్కెట్లను జారీ చేసింది.
ఇంత గొడవ జరగడంతో టీటీడీ స్పందించి, కీలక నిర్ణయం తీసుకుంది. సర్వదర్శన టోకెన్లు లేకున్నా… భక్తులు వెంకన్న దర్శనానికి రావొచ్చని కీలక ప్రకటన చేసింది. ఈ ఒక్కరోజుకే (మంగళవారం) ఈ అనుమతి ఉంటుందని టీటీడీ పేర్కొంది. నేరుగా కొండపైకి చేరుకోవచ్చని టీటీడీ తెలిపింది.