గుంటూరు: టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు సభలో మరోసారి తొక్కిసలాట జరిగింది. ఆయన నాలుగు రోజుల క్రితం కందుకూరులో రోడ్ షో నిర్వహించగా తొక్కిసలాట జరిగి 8 మంది ప్రాణాలు కోల్పోయారు. ఆ ఘటనను మరువకముందే ఇవాళ చంద్రబాబు గుంటూరులో చంద్రన్న సంక్రాంతి కానుక పేరుతో వస్త్రాల పంపిణీకి నిర్వహించిన బహిరంగసభలో మరోసారి తొక్కిసలాట చోటుచేసుకుంది.
ఈ తొక్కిసలాటలో ఒక మహిళ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా.. పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. దాంతో పోలీసులు క్షతగాత్రులను హుటాహుటిన సమీప ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరో ఇద్దరు మరణించారు. దాంతో మొత్తం మృతుల సంఖ్య మూడుకు చేరింది. క్షతగాత్రుల్లో మరికొందరి పరిస్థితి విషమంగా ఉండటంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.