తిరుమల : తిరుమల శ్రీవారి ఆలయ బంగారు తాపడం పనులను ఐదు నుంచి ఆరు నెలల పాటు వాయిదా వేస్తున్నామని టీటీడీ చైర్మన్ వైవి.సుబ్బారెడ్డి వెల్లడించారు. తిరుమల అన్నమయ్య భవనంలో ఈవో ఎవి.ధర్మారెడ్డితో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో విమానగోపురం బంగారు తాపడం పనులను స్థానిక కాంట్రాక్టరు నిర్దేశిత వ్యవధిలో పూర్తి చేయకపోవడంతో ఆలస్యం అవుతోందని చెప్పారు.
తిరుమలలో ఇలాంటి పరిస్థితి తలెత్తకుండా నిర్దేశిత వ్యవధిలో ఆనందనిలయం బంగారు తాపడం పనులు పూర్తి చేసేందుకు వీలుగా గ్లోబల్ టెండర్లకు వెళుతున్నామని అన్నారు. ఈ ప్రక్రియకు సమయం పడుతుండడంతో తాపడం పనులను వాయిదా వేశామని తెలిపారు.
రథసప్తమికి ఏర్పాట్లు పూర్తి
తిరుమలలో రేపు జరుగనున్న రథసప్తమి పర్వదినానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్టు చైర్మన్ తెలిపారు.
ఉదయం 5.30 గంటలకు సూర్యప్రభ వాహనంతో వాహనసేవలు మొదలవుతాయని తెలిపారు. ఉదయం 9 నుంచి 10 గంటల వరకు చిన్నశేష వాహనం, ఉదయం 11 నుంచి 12 గంటల వరకు గరుడ వాహనం, మధ్యాహ్నం 1 నుంచి 2 గంటల వరకు హనుమంత వాహనం, మధ్యాహ్నం 2 నుంచి 3 గంటల వరకు చక్రస్నానం నిర్వహిస్తామన్నారు.
సాయంత్రం 4 నుంచి 5 గంటల వరకు కల్పవృక్ష వాహనం, 6 నుంచి 7 గంటల వరకు సర్వభూపాల వాహనం, రాత్రి 8 నుంచి 9 గంటల వరకు చంద్రప్రభ వాహనసేవలు జరుగుతాయన్నారు. వెంగమాంబ అన్నప్రసాదం కాంప్లెక్స్, పిఎసి-2, 4, వైకుంఠం క్యూ కాంప్లెక్సులో అన్నప్రసాద వితరణతోపాటు గ్యాలరీల్లో వేచి ఉన్న భక్తులకు అన్నప్రసాదాలు, తాగునీరు, టి, కాఫీ, పాలు, మజ్జిగ అందించేందుకు ఏర్పాట్లు చేశామన్నారు.