శ్రీబాలాజీ జిల్లా: తిరుమల శ్రీనివాసుడి భక్తులకు టీటీడీ బోర్డు శుభవార్త తెలిపింది. శ్రీవారి ఆర్జితసేవా టిక్కెట్లను సోమవారం విడుదల చేయనున్నట్లు టీటీడీ తెలిపింది. 46,470 టిక్కెట్లను విడుదల చేస్తామని వెల్లడించింది. మరోవైపు, తిరుమలలో రద్దీ పెరిగింది. భక్తులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. శుక్రవారం 71,589 మంది భక్తులు స్వామివారిని దర్శించుకోగా.. రూ.4.30 కోట్ల హుండీ ఆదాయం లభించింది.
కల్యాణోత్సవం, ఊంజల్సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకరణ టికెట్లను ముందు వచ్చిన వారికి ముందు ప్రాతిపదికన 34,400 కేటాయించనున్నారు. సుప్రభాతం, తోమాల, అర్చన, అష్టదళ పాద పద్మారాధన సేవా టిక్కెట్లను లక్కీడిప్ పద్ధతిలో కేటాయించనున్నారు. టిక్కెట్లు పొందిన వారి జాబితాను ఈ నెల 29 న మధ్యాహ్నం 12 గంటల తర్వాత టీటీడీ వెబ్సైట్లో అప్లోడ్ చేయనున్నారు.
మరోవైపు, తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతున్నది. ఈ నేపథ్యంలో సర్వదర్శనం టైమ్స్లాట్ టోకెన్లు జారీ చేయలేమని టీటీడీ తెలిపింది. ఈ ఏడాఇ ఏప్రిల్ 12 వరకు మాత్రమే టోకెన్లు జారీ చేశారు. రద్దీ పెరుగడంతో నిలిపివేశారు. అప్పటి నుంచి నేరుగా స్వామి వారి సర్వదర్శనానికి అధికారులు అనుమతిస్తున్నారు. కాగా, వైకుంఠం కాంప్లెక్స్లోని 31 కంపార్ట్మెంట్లు భక్తులతో నిండి ఉన్నాయి. శ్రీవారిని దర్శించుకునేందుకు 20 గంటల సమయం పడుతుందని సిబ్బంది చెప్తున్నారు.