శ్రీశైల భ్రమరాంబికా మల్లిఖార్జున స్వామి అమ్మవార్ల హుండీ ఆదాయాన్ని శుక్రవారం లెక్కించారు. ఆలయ ప్రాంగణంలోని అక్కమహాదేవి అలంకార మండపంలో పటిష్ఠమైన నిఘా నేత్రాల మధ్య ఆలయ సిబ్బంది మరియు శివసేవకులు ఉభయ దేవాలయాల హుండీ లెక్కింపు చేశారు. గత 16 రోజులుగా స్వామి అమ్మవార్లకు భక్తులు చెల్లించిన మొక్కులు, కానుకలు నగదు రూపంలో 3,87,79,312 రూపాయలు ( మూడు కోట్ల ఎనభై ఏడు లక్షల డెభ్బై తొమ్మిదివేల మూడు వందల పన్నేండు రూపాయలు ) ఆదాయంగా వచ్చినట్లు ఈవో లవన్న తెలిపారు. వీటితోపాటు 229 గ్రాముల బంగారం, 6 కేజీల 100 గ్రాముల వెండి ఆభరణాలు మరియు 111 యూఎస్ఏ డాలర్లు, 100 ఖతార్ రియాల్స్, 06 కువైట్ దినార్స్, 10 యూఏఈ ధీర్హమ్స్, 02 సింగపూర్ డాలర్లు, 01 మలేషియా రింగేట్ విదేశీ కరెన్సీని స్వామి అమ్మవార్లకు మొక్కులుగా హుండీలో భక్తులు సమర్పించినట్లు ఆలయ అధికారులు తెలిపారు. హుండీ లెక్కింపు కార్యక్రమంలో ధర్మకర్తల మండలి సభ్యులు ఎస్ మాధవీలత, డాక్టర్ కనకదుర్గ, విజయలక్ష్మిలు కూడా పాల్గొన్నారు.
ప్రత్యేక పూజలు.. శాస్త్రోక్తంగా జరిపాం : ఈవో లవన్న
శ్రీశైల మహా క్షేత్రంలో లోకకళ్యాణార్థం శ్రీభ్రమరాంబ మల్లికార్జున స్వామిఅమ్మవార్లకు ప్రత్యేక పూజలు శాస్ర్తోక్తంగా జరిపిస్తున్నట్లు ఈవో లవన్న తెలిపారు. శుక్రవారం ఉదయం గ్రామదేవత అంకాలమ్మకు అభిషేకాలు చేసి వార పూజలు నిర్వహించారు. సాయంత్రం శ్రీ భ్రమరాంబ అమ్మవారికి ప్రీతికరమైన గులాబి, గన్నేరు, దేవగన్నేరు, నందివర్ధనం, గరుడవర్థనం, మల్లెలు, చామంతులతో పుష్పాలంకరణ చేసిన ఊయలలో స్వామి అమ్మవార్లను వేంచేబు చేసి సేవా మహా సంకల్పాన్ని పఠించి అష్టోత్తరం,త్రిశతి, ఖడ్గమాల, లలితాసహస్త్రనామాలతో షోడశోపచార క్రతువులు నిర్వహించారు.
రద్దీ సాధారణం
శ్రీశైల మహా క్షేత్ర దర్శనానికి వచ్చిన భక్తుల సంఖ్య సాధారణంగానే ఉంది. శుక్రవారం ఉదయం నుండి రాత్రి వరకు కొద్ది సంఖ్యలో మాత్రమే స్వామిఅమ్మవార్లను భక్తులు దర్శించుకున్నారు. ఆలయ దక్షిణ మాడవీధిలో ఏర్పాటు చేసిన కళారాధన సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా పోరుమామిళ్ల గ్రామినికి చెందిన వనపర్తి నర్సింహారావు, కొండమ్మ, నాగేంద్ర, బుజ్జమ్మ, అంకోజి తదితర బృందం వారిచే రావణ వధ తోలుబొమ్మలాట నాటికం యాత్రికులను ఆకట్టుకుంది. అదే విధంగా వివిధ ప్రాంతాలకు చెందిన నృత్య కళాకారులచే కూచుపూడి భరతనాట్యంతో స్వామిఅమ్మవార్లకు నృత్య నివేదన చేశారు. అంతరించిపోతున్న కళలకు, కళాకారులకు చేయూతనివ్వడమే కాకుండా సంస్కృతి సాంప్రదాయాలను కాపాడుకోవాలని పీఆర్వో శ్రీనివాసరావు అన్నారు. వివిధ ప్రాంతాల నుండి క్షేత్రానికి వస్తున్నవారు ముందస్తుగా srisailadevasthanam.org వెబ్సైట్లో వసతి గదులు ఆర్జిత సేవాటిక్కెట్లు బుకింగ్ చేసుకోవలని సూచించారు.