శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా నాలుగో రోజు శ్రీభ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్లు మయూర వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. అష్టాదశ శక్తిపీఠాల్లో ఆరో శక్తి పీఠం ద్వాదశ జ్యోతిర్లింగాల్లో రెండవదైన శ్రీశైల మహాక్షేత్రంల్లో మహాశివరాత్రి వేడుకలకు వివిధ ప్రాంతాల నుండి వేలాదిగా భక్తులు తరలివస్తున్నారు. భ్రామరి సమేతుడైన శ్రీశైలేశుడు త్రిశూలధారియై మయూర వాహనంపై విహరించారు.
శ్రీశైల శ్రీభ్రమరాంబ మల్లికార్జున స్వామివార్ల క్షేత్రంలో మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవవంగా జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా నాల్గవరోజు స్వామిఅమ్మవార్లకు ప్రత్యేక పూజలు శాస్త్రోక్తంగా జరిపించినట్లు ఈవో లవన్న తెలిపారు. శుక్రవారం ఉదయం చండీశ్వరపూజ, మండపారాధన, కలశార్చన, శివపంచాక్షరీ జపానుష్టానాలు, రుద్రపారాయణలు, రుద్రహోమం, చండీహోమం నిర్వహించారు. సాయంకాలార్చనలు హోమాల అనంతరం స్వామి అమ్మవార్లను ప్రత్యేకంగా అలంకరించిన మయూర వాహనంపై వేంచేబు చేసి అక్కమహాదేవి అలంకార మండపంలో షోడశోపచార పూజలు చేశారు.
మంగళవాయిద్యాలు డప్పుచప్పుళ్లతో ఆలయోత్సవంతో పాటు క్షేత్ర ప్రధాన వీధుల్లో గ్రామోత్సవం జరిపించారు.ఉత్సవమూర్తులను గంగాధర మండపం నుంచి నంది మండపం వరకు, నందిమండపం నుంచి బయలు వీరభధ్ర స్వామి వరకు జరిగిన ఊరేగింపు ఆద్యంతం కన్నుల పండుగగా సాగింది. స్వామి అమ్మవార్లకు అత్యంత సన్నిహితులైన చెంచు కళాకారుల జానపదాలు, కోలాటాలు, రాజభటుల వేషాలు, జాంజ్ పథక్, గొరవనృత్యం, బుట్టబొమ్మలు, బీరప్పడోలు, నందికోలసేవ, ఢమరుకం, చిడతలు, శంఖం, చెక్కబొమ్మలు వివిధ రకాల విన్యాసాల సందడితో ఊరేగింపు కొనసాగింది. సమస్థ సృష్టి క్రియా చైతన్యానికి ప్రతీక అయిన మయూరం సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి శివునికి వాహనంగా మారుటకు ఇద్దరిలోను ఉన్నది శివాంశ కావడమే.. అని విశ్వసించే భక్తులు స్వామి అమ్మవార్లను దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. గ్రామోత్సవం అనంతరం కాళరాత్రిపూజ మంత్రపుష్పంతో పాటు స్వామి అమ్మవార్లకు ఆస్థానసేవ జరిగింది. గ్రామోత్సవంలో కార్యనిర్వాహణాధికారి లవన్నతోపాటు, అసిస్టెంట్ కమీషనర్ నటరాజ్, ఈఈ మురళీబాలకృష్ణ, పౌరసంభందాల అధికారి శ్రీనివాసరావు, ఏఈఓలు హరిదాస్, ఫణీందర్ ప్రసాద్, శ్రీశైల ప్రభ సంపాదకులు అనీల్కుమార్, రెవెన్యూ అధికారి శ్రీహరి, చీఫ్ సెక్యురిటీ ఆఫీసర్ నర్సింహరెడ్డి, సూపరింటెండెంట్ అయ్యన్న అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.
శివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఐదో రోజు శనివారం శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామివార్లకు శాస్త్రోక్త పూజలు నిర్వహించుకుని సాయంత్రం రావణ వాహనంపై విహరించి భక్తులకు గ్రామోత్సవంలో దర్శనమివ్వనున్నారని ఈవో లవన్న తెలిపారు.