Srisailam | శ్రీశైల భ్రమరాంబికా మల్లిఖార్జున స్వామి అమ్మవార్లకు రూ.3,75,21,688 హుండీ ఆదాయం లభించింది. ఈ మేరకు శుక్రవారం ఆలయ ప్రాంగణంలోని అక్కమహాదేవి అలంకార మండపంలో పటిష్ఠ నిఘా నేత్రాల మధ్య ఆలయ సిబ్బంది, శివ సేవకులు హుండీలో వచ్చిన విరాళాలను లెక్కించారు. ఉభయ దేవాలయాలు, పరివార దేవతాలయాల హుండీలను లెక్కించారు. గత 28 రోజులుగా స్వామి అమ్మవార్లకు భక్తులు చెల్లించిన మొక్కులు, కానుకలు నగదు రూపంలో రూ.3,75,21,688 ఆదాయంగా వచ్చినట్లు ఈవో లవన్న తెలిపారు.
వీటితోపాటు 350 గ్రాముల బంగారం, 6.280 కిలోల వెండి ఆభరణాలు, 2321 అమెరికా డాలర్లు, 100 ఆస్ట్రేలియా డాలర్లు, 35 కెనడా డాలర్లు, 28 మలేషియా రింగిట్స్, 15 ఇంగ్లాండ్ ఫౌండ్లు, నాలుగు సింగపూర్ డాలర్లు, 40 యూరోలు, 20 యూఏఈ దిర్హమ్లు తదితర విదేశీ కరెన్సీని భక్తులు స్వామి అమ్మవార్లకు మొక్కులుగా సమర్పించారని ఆలయ అధికారులు తెలిపారు.
శ్రీశైల మహా క్షేత్రంలో శ్రీభ్రమరాంబ మల్లికార్జున స్వామిఅమ్మవార్లకు ప్రత్యేక పూజలు శాస్ర్తోక్తంగా జరిపిస్తున్నట్లు ఈవో ఎస్ లవన్న తెలిపారు. శుక్రవారం ఉదయం గ్రామదేవత అంకాలమ్మకు వార పూజల్లో భాగంగా అభిషేకాలు, విశేషార్చనలు చేశారు. సాయంత్రం శ్రీ భ్రమరాంబ అమ్మవారికి ప్రీతికరమైన గులాబి, గన్నేరు, దేవగన్నేరు, నందివర్ధనం, గరుడవర్థనం, మల్లెలు, చామంతులతో పుష్పాలంకరణ చేసిన ఊయలలో స్వామి అమ్మవార్లను వేంచేబు చేసి సేవా మహా సంకల్పాన్ని పఠించారం. అష్టోత్తరం, త్రిశతి, ఖడ్గమాల, లలితాసహస్త్రనామాలతో షోడశోపచార క్రతువులు నిర్వహించారు.
శ్రీశైల దేవస్థానానికి తూర్పు గోదావరి జిల్లా నెలమురు వాసి మోహన సత్యభాస్కర మణికంఠ శుక్రవారం వెండి పళ్లెం బహుకరించారు. 1.367 కిలోగ్రాముల బరువు గల వెండి పళ్లెం విలువ సుమారు రూ.1,08,417 ఉంటుందని దాతలు తెలిపారు. ఈ మేరకు దేవస్థానం ఈవో ఎస్ లవన్నకు దాతలు ఈ వెండి పళ్లెం అందజేశారు. అనంతరం దాతలకు శ్రీ స్వామి అమ్మవార్ల శేష వస్త్రాలను ఈఓ లవన్న అందజేశారు.