తిరుపతి : శ్రీనివాసమంగాపురం కల్యాణ వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాల్లో (Brahmotsavam) రెండో రోజు శుక్రవారం శ్రీనివాసుడు మురళి కృష్ణుడి అలంకారంలో ఐదు తలలు గల చిన్నశేష వాహనం ( Chinna Seshavahanam) పై దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా ఆలయ మాడవీధుల్లో స్వామివారిని ఊరేగించారు. చిన్నశేష వాహనం శ్రీవారి వ్యక్తరూపమైన పాంచభౌతిక ప్రకృతికి సంకేతమని అర్చకులు తెలిపారు.
అంతకు ముందు స్వామి, అమ్మవార్ల ఉత్సవర్లకు వేడుకగా స్నపన తిరుమంజనం నిర్వహించారు. పాలు, పెరుగు, తేనె, కొబ్బరి నీళ్ళు, పసుపు, చందనంలతో అభిషేకం నిర్వహించారు. కార్యక్రమంలో జేఈవో వీరబ్రహ్మం, ఆలయ ప్రత్యేక శ్రేణి డిప్యూటీ ఈవో వరలక్ష్మి, ఏఈవో గోపినాథ్, వైఖానస ఆగమ సలహాదారులు మోహన రంగాచార్యులు తదితరులు పాల్గొన్నారు.