అమరావతి : ఆంధ్రప్రదేశ్లోని సత్యసాయి జిల్లా తాడిమర్రి మండలం చిల్లకొండయ్యపల్లి వద్ద కూలీలతో వెళ్తున్న ఆటోపై హైటెన్షన్ వైర్లు తెగి పడి ఐదుగురు సజీవదహనమైన ఘటనపై ఏపీఎస్పీడీసీఎల్ సీఎండీ హరనాథరావు వివరాలు వెల్లడించారు. విద్యుత్ తీగ నుంచి స్థంబంపై ఉన్న ఇనుప క్లాంప్ మీదకు ఉడత దూకిందని తెలిపారు. ఉడత దూకిన సమయంలో షార్ట్ సర్క్యూట్, ఎర్త్ కావడంతో తీగలు తెగి అదే సమయంలో ఆటోపై హైటెన్షన్ విద్యుత్ తీగలు పడ్డాయని వివరించారు.
ఈ ఘటనలో మృతుల కుటుంబాలకు సంస్థ తరుఫున రూ. 5లక్షలను అందజేస్తామని ప్రకటించారు. గాయపడ్డ వారికి రూ. 2లక్షల ఆర్థిక సహాయం అందిస్తామని వెల్లడించారు. ఘటనపై పూర్తిస్థాయి దర్యాప్తు చేయాలని సీఎండీ అనంతపురం సర్కిల్ సూపరింటెండెంట్ ఇంజినీర్ను ఆదేశించారు.