Srisailam | గురు పౌర్ణమి సందర్భంగా సోమవారం ఉదయం శ్రీశైలం ఆలయ ప్రాంగణంలోకి అక్క మహాదేవి – హేమారెడ్డి మల్లమ్మ మందిరం వద్ద దక్షిణ మూర్తి స్వామి వారికి, వ్యాస మహర్షికి విశేష పూజలు చేశారు. ముందుగా అర్చక స్వాములు, వేద పండితులు పూజా సంకల్పం పఠించారు. తర్వాత మహా గణపతి పూజ చేశారు. అటుపై దక్షిణ మూర్తి, వ్యాస మహర్షి చిత్ర పటాలకు షోడశోపచార పూజలు చేశారు.
ఒకే రాశిగా ఉన్న వేదాన్ని నాలుగు విభాగాలుగా చేసి లోకాలకు అందించిన వ్యాస మహర్షి కారణ జన్ముడు. వ్యాస మహర్సి అసలు పేరు క్రుష్ణ ద్వైపాయనుడు. వేదాలను నాలుగు విభాగాలుగా విభజించి లోకానికి అందించినందుకు ఆయనకు వేద వ్యాసుడు అనే పేరు ప్రసిద్ధమైంది. మంత్ర రూపంలోని వేదాల పరమార్థం గ్రహించలేని సామాన్యుల కోసం వ్యాస మహర్షి మహా భారతం కూడా రచించాడు. అందువల్లే మహాభారత గ్రంథం పంచమ వేదంగా పేరొందింది. అలాగే లోకోద్దరణ కోసం వ్యాస మహర్షి 18 పురాణాలను కూడా రచించాడు.
లోకంలోని ప్రతి విషయాన్ని కూడా వ్యాస మహర్షి తన సాహిత్యంలో పేర్కొన్నాడని చెబుతారు. అందుకే ఆయన చెప్పని విషయాలేవీ లోకంలో కనిపించవనే భావన ఎంతో ప్రసిద్ధం. ఈ కార్యక్రమంలో ఆలయ సహాయ కార్య నిర్వహణాధికారి ఎం హరిదాసు, అర్చక స్వాములు, వేద పండితులు, తదితరులు పాల్గొన్నారు.