విశాఖపట్నం ఇంటెలిజెన్స్ ఎస్పీ మధు ఎంపీ ఎంవీవీ సత్యనారాయణపై పోలీసులకు ఫిర్యాదు చేయడం ఇప్పుడు సంచలనం రేపుతోంది. ఎంపీ సత్యానారాయణ తనకు సంబంధించిన స్థలంలో వెంచర్ కోసం రోడ్డు నిర్మాణపు పనులు చేపట్టారని ఎస్పీ మధు ఆరోపించారు. ఈ నిర్మాణపు పనులను గమనించే… తాను కాంపౌండ్ వాల్ నిర్మిస్తున్నానని, ఈ నిర్మాణాన్ని అడ్డుకున్నారని పోలీసులకిచ్చిన ఫిర్యాదులో ఆ ఎస్పీ పేర్కొన్నారు.
విశాఖలోని బక్కన్నపాలెం సర్వే నెంబర్ 90/1ఏ లో ఇంటెలిజెన్స్ ఎస్పీ మధు కాంపౌండ్వాల్ నిర్మిస్తున్నారు. దీనిని ఎంపీ అనుచరులు అడ్డుకున్నారు. తన నిర్మాణ స్థలంలో ఎంపీ రోడ్డు నిర్మాణపు పనులు చేపట్టారని, దీనిని గమనించే, తాను.. తన స్థలంలో కాంపౌండ్ వాల్ నిర్మిస్తున్నానని ఎస్పీ మధు స్పష్టం చేశారు.
ఎస్పీ ఆరోపణలను ఖండించిన ఎంపీ
ఇంటెలిజెన్స్ ఎస్పీ మధు చేసిన ఆరోపణలపై ఎంపీ సత్యానారాయణ స్పందించారు. ఎస్పీ మధు చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నట్లు పేర్కొన్నారు. ఎస్పీ మధు అర్ధరాత్రి వచ్చి అక్కడ గోడ నిర్మిస్తున్నారని తమకు సమాచారం వచ్చిందన్నారు. దీంతో అనుమానం వచ్చే పనులు ఆపేశామని పేర్కొన్నారు. అయితే ఈ ల్యాండ్ రికార్డుల్లో లే అవుట్ రోడ్గా చూపిస్తోందని, ఆ భూమి నిజంగా ఎస్పీదే అయితే… తమకు ఇబ్బందే లేదని ఎంపీ సత్యానారాయణ స్పష్టం చేశారు.
విచారణకు ఆదేశించిన జిల్లా కలెక్టర్
ఇంటలిజెన్స్ ఎస్పీ మధు, ఎంపీ సత్యానారాయణ మధ్య స్థల వివాదం రేగడంతో కలెక్టర్ రంగంలోకి దిగారు. ఈ వివాదంపై విచారణకు ఆదేశించారు. కలెక్టర్ విచారణకు ఆదేశించడంతో రెవిన్యూ, జీవీఎంసీ అధికారులు రంగంలోకి దిగి, విచారణ జరుపుతున్నారు. అసలు కొనుగోలు సక్రమంగా జరిగిందా? లేదా? అన్న విషయంపై తుది నిర్ణయం తీసుకుంటామని తహశీల్దార్ పేర్కొన్నారు.