విజయవాడ : ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం పేరు మార్పుపై బీజేపీ అభ్యంతరం తెలిపింది. దీనిని తీవ్రంగా వ్యతిరేకించిన ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు.. ఇది ముమ్మాటికీ ఆంధ్రుల ఆత్మగౌరవాన్ని మంటకలపడమేనన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని వైద్య కళాశాలలన్నింటినీ ఒకే గొడుగు కిందకు తీసుకు వచ్చిన ఎన్టీఆర్ ఆ మేరకు ఆరోగ్య విశ్వవిద్యాలయాన్ని నెలకొల్పిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు. ఆయన సేవలకు గుర్తింపుగా హెల్త్ యూనివర్సిటీకి ఆయన పేరును అప్పటి ప్రభుత్వం ఖరారు చేసిందని, ఇప్పుడు ఈ ప్రభుత్వం ఆ పేరును తొలగించడం సరికాదని సోము వీర్రాజు అన్నారు.
ప్రభుత్వం కుట్రపూరితంగా దొడ్డిదారిన ఎన్టీఆర్ పేరు తొలగించిందని సోము వీర్రాజు అభిప్రాయపడ్డారు. ఎన్టీ రామారావు పేరును తొలగించి వైఎస్ రాజశేఖర్రెడ్డి పేరును ఎలా పెడతారని ప్రశ్నించారు. దీనిపై ముఖ్యమంత్రి జగన్ క్లారిటీ ఇవ్వాలని సోము వీర్రాజు డిమాండ్ చేశారు. అసెంబ్లీ సాక్షిగా ప్రభుత్వం అబద్ధాలు చెప్తుందని ఆయనన్నారు. ఎన్టీఆర్ పేరును ఆరోగ్య విశ్వవిద్యాలయానికి తొలగించడాన్ని తమ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నదని ఆయన తెలిపారు.