చిత్తూరు జిల్లా: పుంగనూరులో విషాదం చోటుచేసుకున్నది. వ్యాయామం చేస్తూ యువ సాఫ్ట్వేర్ ఇంజినీర్ గుండెపోటుకు గురై మృతి చెందాడు. మృతుడికి రెండు నెలల క్రితమే వివాహం కాగా.. భార్య ఆషాఢ మాసం కారణంగా పుట్టింటికి వెళ్లింది.
పుంగనూరుకు చెందిన రిటైర్డ్ ఆర్మీ ఉద్యోగి సుధాకర్రెడ్డికి ఇద్దరు కుమారులు. పెద్ద కుమారుడు తేజ విష్ణువర్ధన్రెడ్డి (27) బెంగళూరులో సాఫ్ట్వేర్ ఇంజినీర్గా ఓ ప్రముఖ కంపెనీలో పనిచేస్తున్నాడు. ఇతడికి రెండు నెలల క్రితం ప్రొద్దుటూరుకు చెందిన లావణ్యతో వివాహమైంది. లావణ్య కూడా సాఫ్ట్వేర్ ఇంజినీర్గా పనిచేస్తున్నారు. ఆషాఢ మాసం కావడంతో ఆమె పుట్టింటికి వెళ్లింది. నిత్యం ఉదయం వేళ వ్యాయామం చేసే అలవాటున్న విష్ణువర్ధన్రెడ్డి.. ఎప్పటిమాదిరిగానే ఆదివారం ఉదయం సైక్లింగ్ చేస్తూ కుప్పకూలిపోయాడు.
పడిపోయిన విషయాన్ని గుర్తించిన తండ్రి సుధాకర్ రెడ్డి వెంటనే అదే గ్రామంలో ఉన్న డాక్టర్ చైతన్య తేజా రెడ్డికి సమాచారమిచ్చాడు. ఆయన వచ్చి పరిశీలించి గుండెపోటుతో మృతి చెందినట్లు నిర్ధారించారు. భర్త మృతి చెందిన విషయం తెలుసుకున్న లావణ్య గ్రామానికి చేరుకుని మృతదేహాన్ని చూసి కన్నీరుమున్నీరైంది. ఆషాడ మాసం పూర్తి చేసుకున్న తర్వాత కొత్త జంట తిరుమల వెంకన్నను దర్శించుకుని హనీమూన్ వెళ్లేందుకు ఏర్పాట్లు చేసుకున్నట్లు సమాచారం. ఇంతలో ఈ విషాద ఘటన జరుగడంతో అందరినీ శోకసంద్రంలో ముంచెత్తింది.