Madhavi Reddy : ఆంధ్రప్రదేశ్లో సోషల్ మీడియా వేదికగా జరుగుతున్న ప్రచారాలపై ప్రభుత్వం దృష్టి సారించిన వేళ.. కడపలో రాజకీయ దుమారం రేగింది. కడప టీడీపీ ఎమ్మెల్యే మాధవి రెడ్డిని కించపరిచేలా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారన్న ఆరోపణలపై మాజీ డిప్యూటీ సీఎం, వైసీపీ నేత అంజాద్ బాషా పీఏ షేక్ ఖాజాను పోలీసులు అరెస్ట్ చేశారు. హైదరాబాద్లో ఉన్న ఖాజాని కడప పోలీసు బృందం అదుపులోకి తీసుకుని కడపకు తరలించింది.
తనపై సామాజిక మాధ్యమాల్లో ఉద్దేశపూర్వకంగా అనుచిత ప్రచారం చేస్తున్నారని ఆరోపిస్తూ ఎమ్మెల్యే మాధవి రెడ్డి, టీడీపీ పోలిట్బ్యూరో సభ్యుడు అయిన ఆమె భర్త శ్రీనివాసులరెడ్డి ఇటీవల కడప వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ పోస్టుల వెనుక అంజాద్ బాషా, ఆయన సోదరుడు అహ్మద్ బాషా, పీఏ ఖాజా ఉన్నారని తమ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు ముగ్గురిపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ క్రమంలోనే ఖాజాని అరెస్ట్ చేసి, కడప శివార్లలోని పోలీస్ శిక్షణా కేంద్రంలో విచారణ చేస్తున్నారు.
కాగా ఈ అరెస్ట్ను వైసీపీ తీవ్రంగా ఖండించింది. కూటమి ప్రభుత్వం తమ పార్టీ నేతలపై కక్ష సాధింపు చర్యలను కొనసాగిస్తున్నదని ఆరోపించింది. ఈ అక్రమ అరెస్టులు ఇంకెంతకాలం కొనసాగుతాయని పార్టీ ప్రశ్నించింది.