అమలాపురం, డిసెంబర్ 27: అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆంధ్రప్రదేశ్కు చెందిన ఆరుగురు మరణించారు. వీరంతా ముమ్మిడివరం వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే వెంకట సతీశ్కుమార్ బంధువులు. జార్జియా రాష్ట్రంలో నివాసముంటున్న పీ నాగేశ్వరరావు క్రిస్మస్ సెలవుల్లో టెక్సాస్లోని తమ బంధువు ఇంటికి వెళ్లారు. కారులో మొత్తం ఏడుగురు వెళ్లి మంగళవారం తిరుగు పయనమయ్యారు. మార్గమధ్యలో వీరి కారును ఎదురుగా వస్తున్న ఓ లారీ బలంగా ఢీకొట్టింది. దీంతో నాగేశ్వరరావు ఆయన కుటుంబసభ్యులు సీతా మహాలక్ష్మి, నవీన, కృత్రిక్, నిశిత, మరొకరు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. తీవ్ర గాయాలపాలైన ఇంకొకరు దవాఖానలో చికిత్స పొందుతున్నారు. ఆయన పరిస్థితి కూడా విషమంగానే ఉన్నది. లారీలో ఉన్న ఇద్దరు కూడా గాయపడ్డారు. లారీ డ్రైవర్ నిర్లక్ష్యంతోనే ప్రమాదం జరిగినట్టు పోలీసులు భావిస్తున్నారు. దుర్ఘటనపై ఎమ్మెల్యే సతీశ్కుమార్ దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. మృతదేహాలను ఏపీకి తీసుకురావడానికి అమెరికాలోని తెలుగు అసోసియేషన్ ప్రతినిధులు, భారత ప్రభుత్వం సాయం తీసుకుంటున్నామని తెలిపారు.