అనంతపురం: ధర్మవరం రెవెన్యూ డివిజన్ను రద్దు చేయవద్దని డిమాండ్ చేస్తూ టీడీపీ చేపట్టిన ఆందోళన ఉద్రిక్తతకు దారితీసింది. పరిటాల శ్రీరామ్ను టార్గెట్ చేసిన పోలీసులు.. ఆయన దీక్షకు దిగకుండా చర్యలు తీసుకున్నారు. దాంతో పోలీసులు, టీడీపీ శ్రేణుల మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకున్నది. అయితే, ఎట్టకేలకే పరిటాల శ్రీరామ్ నిరాహార దీక్షకు కూర్చున్నారు. ప్రభుత్వ ప్రతిపాదనలకు వ్యతిరేకంగా ఎమ్మార్వో కార్యాలయం ఎదుట దీక్షకు దిగారు.
అనంతపురం జిల్లాలోని ప్రస్తుతం ఉన్న ధర్మవరం డివిజన్ రూపురేఖలు మార్చేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. ప్రభుత్వ నిర్ణయాన్ని ధర్మవరానికి చెందిన టీడీపీ శ్రేణులు వ్యతిరేకిస్తున్నారు. ప్రభుత్వం తీరును నిరసిస్తూ పరిటాల శ్రీరామ్ నేతృత్వంలో దీక్ష చేపట్టాలని టీడీపీ నేతలు నిర్ణయించారు. దీక్ష ప్రాంగణానికి చేరుకోకుండా పలువురు టీడీపీ నేతలను నిర్భందంలోకి తీసుకున్నారు. పోలీసుల తీరుపై ఆగ్రహించిన టీడీపీ శ్రేణులు ఒకానొక దశలో రోడ్డుపై బైఠాయించేందుకు కూడా నిర్ణయించారు. అయితే పోలీసు అధికారులు మధ్యవర్తిత్వం నెరిపి వారిని శాంతింపజేశారు.
పరిటాల శ్రీరామ్ దీక్షను అడ్డుకునేందుకు పోలీసులపై వైసీపీ నేతలు ఒత్తిడి తీసుకువచ్చి ఇదంతా చేయిస్తున్నారని టీడీపీ నేతలు ఆరోపించారు. శాంతియుతంగా దీక్ష చేపట్టేందుకు వెళ్తున్న తమను అడ్డుకోవడంపై టీడీపీ కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు. పరిటాల కుటుంబంపై కోపంతో ఉన్న ప్రభుత్వ పెద్దలు కావాలనే ధర్మవరం రెవెన్యూ డివిజన్ను రద్దు చేయిస్తున్నారని టీడీపీ నేతలు మండిపడుతున్నారు. ధర్మవరం డివిజన్ను రద్దు చేస్తే తమ ఆందోళనను మరింత ఉధృతం చేస్తామని వారు హెచ్చరిస్తున్నారు. పరిటాల శ్రీరామ్ దీక్షతో అనంతపురం టీడీపీలో ఒక్కసారిగా ఊపు వచ్చింది. రెట్టించిన ఉత్సాహంతో టీడీపీ శ్రేణులు పెద్ద సంఖ్యలో దీక్షా స్థలికి తరలివచ్చారు.