తిరుపతి : తిరుపతి శ్రీ గోవిందరాజస్వామి (Govindarajaswamy) వారి తెప్పోత్సవాలు శనివారం వైభవంగా ప్రారంభమయ్యాయి. ఏడు రోజుల పాటు జరుగనున్న ఈ తెప్పోత్సవాల్లో శనివారం రాత్రి 6.30 నుంచి 8 గంటల వరకు శ్రీ కోదండరామస్వామి( Kodandaramaswamy) వారు తెప్పపై విహరించి భక్తులకు దర్శనమిచ్చారు. అనంతరం ఆలయ నాలుగు మాడ వీధుల్లో ఊరేగి భక్తులను అనుగ్రహించారు.
మొదటిరోజు సీతా లక్ష్మణ సమేత కోదండరామస్వామివారు తెప్పపై పుష్కరిణిలో విహరించారు. మొత్తం ఐదు చుట్లు తిరిగి భక్తులకు దర్శనభాగ్యం కల్పించారు. అదేవిధంగా ఆదివారం పార్థసారథిస్వామి భక్తులకు దర్శనమిస్తారని వెల్లడించారు. ఈ సందర్భంగా టీటీడీ (TTD) హిందూ ధర్మప్రచార పరిషత్, అన్నమాచార్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో భజనలు, హరికథ, సంగీత కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఏఈవో మునికృష్ణ రెడ్డి, సూపరింటెండెంట్ నారాయణ,టెంపుల్ ఇన్స్పెక్టర్ ధనంజయ, భక్తులు పాల్గొన్నారు.