అమరావతి : రికార్డులు సృష్టించడంలో అబ్బాయిలకు తామేమి తీసిపోమని నిరూపిస్తున్నారు అమ్మాయిలు. చిరుప్రాయంలోనే సాహసాలతో వరల్డ్ రికార్డులను సొంతం చేసుకుంటూ ఆదర్శంగా నిలుస్తున్నారు. చిత్తూరు జిల్లా పుత్తూరు పట్టణానికి చెందిన 8 ఏళ్ల వెన్సిక శిరి అనే బాలిక 250 కిలోమీటర్లు ఏకధాటిగా స్కేటింగ్ పూర్తిచేసి రికార్డు సృష్టించి అందరి మన్ననలు పొందింది.
మురళి, సరిత దంపతుల కుమార్తె శిరి వజ్ర వరల్డ్ రికార్డు సంస్థ సీఈవో తిరుపతిరావు, పలమనేరు డీఎస్పీ గంగయ్య సమక్షంలో ఏపీ సరిహద్దు ప్రాంతం నంగిలి నుంచి ఉదయం 7 గంటలకు స్కేటింగ్ను ప్రారంభించింది. రాత్రి 10.30 నిమిషాల వరకు ఏకధాటిగా దాదాపు 250 కి. మీ నగరి వరకు స్కేటింగ్ చేసి ఔరా అనిపించుకుంది. బేటీ బచావో.. బేటీ పడావో, అమ్మాయి చదువు.. ఇంటికి వెలుగు, ఆడపిల్లలను అన్నింటా ఎదగనిద్దాం అనే లక్ష్యంతో స్కేటింగ్ కొనసాగించిన శిరిని నగరి ఎమ్మెల్యే రోజా ప్రత్యేకంగా అభినందించారు.