గుంటూరు: ఆపరేషనల్ సమస్యల కారణంగా గుంటూరు మీదుగా నడిచే పలు రైళ్లను ఇవాళ నుంచి రద్దు చేస్తున్నట్లు డివిజనల్ రైల్వే తెలిపింది. ఈ రైళ్ల రద్దు ఈ నెల 20వ తేదీ వరకు ఉంటుందని వెల్లడించింది. విజయవాడ- కొండపల్లి మధ్య మూడో రైలు మార్గం నాన్ ఇంటర్లాకింగ్ పనులు చివరి దశకు చేరుకున్నాయి. దాంతో కొన్ని గూడ్స్ రైళ్లను మోటుమర్రి-విష్ణుపురం మీదగా నడికుడి మార్గంలో మళ్లిస్తున్నారు. ఫలితంగా 6 రోజుల పాటు ప్యాసింజర్ రైళ్లను రద్దు చేస్తూ అధికారులు నిర్ణయం తీసుకున్నారు.
విజయవాడ-గుంటూరు (రైలు నంబర్లు 07783, 07628, 07464), గుంటూరు-తెనాలి (నంబర్ 07887), గుంటూరు-రేపల్లె (రైలు నంబర్ 077 86), రేపల్లె-తెనాలి (రైలు నంబర్ 07873), తెనాలి-గుంటూరు (నంబర్ 07282), గుంటూరు-విజయవాడ (రైలు నంబర్లు 07864, 07465), తెనాలి-రేపల్లె (రైలు నంబర్ 07888), రేపల్లె-మార్కాపురం (రైలు నంబర్ 07889), మార్కాపురం-తెనాలి (రైలు నంబర్ 07890), తెనాలి-విజయవాడ (రైలు నంబర్ 07630) ప్యాసింజర్ రైళ్లని రద్దు చేసినట్లు గుంటూరు డివిజనల్ రైల్వే అధికారులు తెలిపారు.
అలాగే, మాచర్ల-గుంటూరు ప్యాసింజర్ రైలును నడికుడి వరకే నడపనున్నారు. విజయవాడ-మాచర్ల ప్యాసింజర్ రైలును నడికుడి నుంచి మాచర్లకు, మాచర్ల-విజయవాడ ప్యాసింజర్ని నడికుడి వరకే నడుపుతారు.