తాడేపల్లి: ఏపీ అసెంబ్లీ పోలవరంపై వాదోపవాదాలతో దద్దరిల్లింది. అధికార, ప్రతిపక్ష పార్టీ నేతల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకున్నది. పోలవరం ముంపు పరిహారంపై ప్రతిపక్ష టీడీపీ లేవనెత్తిన అంశాలపై తొలుత ఏపీ నీటిపారుదల శాఖ మంత్రి అంబటి రాంబాబు స్పష్టతనిచ్చారు. అనంతరం సీఎం జగన్ అసెంబ్లీలోనే పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చి పోలవరం ప్రాజెక్టు కడుతున్న తీరును అసెంబ్లీకి వివరించారు.
పోలవరం ప్రాజెక్టు ముంపు బాధితులను ప్రభుత్వం విస్మరిస్తున్నదని టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఆరోపించడంతో అసెంబ్లీలో వాగ్వాదం మొదలైంది. ముంపు బాధితులకు రూ.10 లక్షలిస్తామని సీఎం జగన్ హామీ ఇచ్చారని బుచ్చయ్య చౌదరి గుర్తుచేశారు. ఎంత మందికి పరిహారం ఇచ్చారని ప్రశ్నిస్తే ప్రశ్నే ఉత్పన్నం కాదని సమాధానం ఇవ్వడమేంటని ఆయన ప్రశ్నించారు. దీనికి సమాధానమిస్తూ.. భూములు కోల్పోయిన వారికి రూ.10 లక్షలిస్తామని హామీ ఇవ్వలేదని స్పష్టంచేశారు. పరిహారం ఇవ్వమన్నప్పుడు ఎన్ని ఎకరాలనే ప్రశ్నే ఉత్పన్నం కాదని అంబటి చెప్నారు. ఇళ్లు కోల్పోయిన వారికి మొత్తం రూ.10 లక్షలు ఇస్తామని సీఎం హామీ ఇచ్చిన విషయాన్ని సభ దృష్టికి తీసుకొచ్చారు. ఇందులో కేంద్రం వాటా రూ.7.5 లక్షలు కాగా, రాష్ట్రం వాటా రూ.2.5 లక్షలు అని అంబటి తెలిపారు.
ఈ సందర్భంగా సీఎం జగన్ జోక్యం చేసుకుని.. పోలవరం నిర్వాసితులకు ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ కింద రూ.6.86 లక్షల పరిహారం గతంలో ఇచ్చారని, తాము అధికారంలోకి వస్తే దాన్ని రూ.10 లక్షలకు పెంచుతామని చెప్పామని, ఇచ్చిన మాట ప్రకారం ఉత్తర్వులు కూడా జారీ చేసినట్లు తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో 3073 మందికి పునరావాసం కింద కేవలం రూ.193 కోట్టే ఖర్చుచేశారని, అదే తమ ప్రభుత్వం గత మూడేండ్లలో 10,330 మందికి పునరావాసం కింద రే.1773 కోట్లు ఖర్చు చేశామన్నారు. రూ.1960.95 కోట్ల వ్యయంతో 14,110 మంది నిర్వాసితుల పునరావాసం పూర్తయిందని, పునరావాసం పనులు శరవేగంగా జరుగుతున్నాయని చెప్పారు. ఈ సందర్భంగా పోలవరం ప్రాజెక్టు పనులు టీడీపీ హయాంలో జరిగిన, వైసీపీ హయాంలో జరుగుతున్న తీరును పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. చంద్రబాబు నాయుడు దగ్గరుండి మరీ ప్రాజెక్టును సర్వనాశనం చేశారని జగన్ దుయ్యబట్టారు. చంద్రబాబు నాశనం చేసిన ప్రాజెక్టను రిపేర్ చేసేందుకు చాలా కుస్తీలు పట్టాల్సి వస్తుందని విమర్శించారు. ఇవన్నీ చూస్తుంటే చంద్రబాబు సీఎం పదవికి కాదు కదా ఎమ్మెల్యే అయ్యేందుకు కూడా అన్ఫిట్ అని వ్యంగ్యంగా అన్నారు.