అమరావతి : ఏపీ వైసీపీలో కొనసాగుతున్న సీనియర్ల రాజీనామాలపై ఆ పార్టీ నేత వైవీ సుబ్బారెడ్డి( YV Subba Reddy) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పార్టీ మారుతున్న వారంతా వ్యక్తిగత కారణాలతో పార్టీకి రాజీనామా (Resigns) చేస్తున్నారని పేర్కొన్నారు. కొన్ని రోజులుగా పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి వైఎస్ జగన్(Jagan) పార్టీలో ఎంతటి సీనియర్నైనా పక్కన పెట్టి గెలుపు గుర్రాలకు అవకాశం ఇస్తుండడంతో సిట్టింగ్ ఎంపీలు(MPs), ఎమ్మెల్యేలు(MLAs) నిరాశలో ఉన్నారు.
ఇప్పటి వరకు విడుదల చేసిన ఇన్చార్జిల జాబితాతో పాటు పోటీ చేసే అభ్యర్థుల జాబితాను విడుదల చేశారు. ఈ జాబితాలో పేర్లు లేని, మళ్లీ అవకాశం రాని నాయకులంతా వరుస పెట్టి రాజీనామాలు చేస్తున్నారు. ఈ సందర్భంగా వైవీ సుబ్బారెడ్డి మీడియాతో మాట్లాడారు. పార్లమెంట్, అసెంబ్లీ నియోజకవర్గాల ఇన్చార్జిల మార్పు విషయంలో వైఎస్ జగన్ క్లారిటీతోనే ఉన్నారని తెలిపారు. గెలుపునకు దూరంగా ఉన్న అభ్యర్థులకు సీట్లు ఉండవని ముందు నుంచే చెబుతూ వస్తున్నారని గుర్తు చేశారు.
కొత్త మార్పులు, చేర్పులకు సంబంధించిన ఫైనల్ లిస్ట్ పండుగ తర్వాత వస్తుందని పేర్కొన్నారు. త్వరలోనే పార్టీలో లుకలుకలు సర్దుకుంటాయని స్పష్టం చేశారు. ఒంగోలు లోక్సభకు తాను పోటీ చేయనని, పోటీ చేయాలనుకుంటే 2019 ఎన్నికల్లోనే పోటీ చేసేవాడినని వెల్లడించారు. పోటీ చేసే విషయంలో జగన్ నిర్ణయానికి కట్టుబడి ఉంటానని వివరించారు.