కర్నూలు: జిల్లాలోని సరిహద్దు చెక్పోస్ట్ వద్ద పెద్ద మొత్తంలో బంగారు ఆభరణాలు, వజ్రాలు పట్టుబడ్డాయి. సోమవారం తెల్లవారజామున పంచలింగాల అంతర్రాష్ట్ర సరిహద్దు వద్ద వాహనాల తనిఖీల్లో ఈ నిధి బయటపడింది. బంగారం తరలిస్తున్న రాజస్థాన్కు చెందిన కపిల్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. వీటి విలువ దాదాపు రూ.39.28 లక్షల వరకు ఉంటుందని పోలీసులు తెలిపారు.
ఎస్ఈబీ సీఐ మంజుల తెలిపిన వివరాల ప్రకారం.. కర్నూలు జిల్లా పంచలింగాల అంతర్రాష్ట్ర చెక్పోస్ట్లో ఎప్పటిమాదిరిగా పోలీసులు వాహన తనిఖీలు చేపట్టారు. సోమవారం తెల్లవారుజామున హైదరాబాదు నుంచి బెంగళూరు వెళ్తున్న ఎన్ఎల్ 01 బీ 2048 అనే నంబర్ గల నిదా ట్రావెల్స్ ప్రైవేటు బస్సులో తనిఖీ చేయగా రాజస్థాన్లోని జున్జున్ పట్టణానికి చెందిన కపిల్ అనే వ్యక్తి బ్యాగులో దాదాపు 840 గ్రాముల బంగారు ఆభరణాలు, 57 వజ్రాలను పోలీసులు గుర్తించారు.
హైదరాబాద్లో ఉన్న తన అన్న ఈ నగలను బెంగళూరులోని పలు నగల దుకాణాలకు ఇచ్చి రమ్మన్నాడని, అంతకు మించి తనకేమీ తెలియదని కపిల్ పోలీసులకు చెప్పాడు. ఆభరణాలకు సంభందించి ఈ-వే బిల్లు, ట్రావెలింగ్ ఓచర్, జీయస్టీ బిల్లులు లేకుండా బంగారం, వజ్రాలు తరలిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.