తాడేపల్లి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని రాజకీయంగా ఎదుర్కొనే ధైర్యం చంద్రబాబుకు లేదని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. అందుకే రోజూ ఏదో ఒక అబద్ధం చెప్తూ తప్పుడు ప్రచారం చేస్తున్నరని మండిపడ్డారు. తక్షణమే జగన్ను ముఖ్యమంత్రి పదవి నుంచి దించేయాలని దుష్టచతుష్టయం కుట్రలు పన్నుతున్నదన్నారు. అధికారం లేకపోవడంతో చంద్రబాబుతో పాటు ఈ పచ్చ మీడియా కూడా నిలబడలేకపోతున్నాయని గురువారం ఆయన తాడేపల్లిలో మీడియాతో మాట్లాడారు.
సీఆర్డీఏ భూముల విక్రయాలంటూ తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని, అబద్ధాలను నిజమంటూ ప్రజలను నమ్మించే ప్రయత్నం చేస్తున్నారని సజ్జల ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓటర్లను తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నిస్తున్నారన్నారు. మసి బూసి మారేడుకాయ చేయాలని గట్టిగా ముందుకెళ్తున్నారని చెప్పారు. చంద్రబాబుకు అధికారం లేదన్న బాధ, దుగ్ధ, విరహంతో పచ్చ మీడియా చేస్తున్న దుష్ప్రచారం మరెక్కడా చూసి ఉండరన్నారు. తాను అధికారంలో లేనన్న ఆక్రోశంతో తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని, వ్యవస్థనే నేరస్థుడిగా చూపే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. అమరావతి రాజధానిగా ఉండదని తమ పార్టీ రాజకీయంగా తీసుకున్న నిర్ణయమని, అధికార వికేంద్రీకరణను దృష్టిలో పెట్టుకుని మూడు రాజధానులను ఏర్పాటుకు నిర్ణయించామని చెప్పారు.
తమ ప్రభుత్వ హయాంలో ఒక్క డిస్టిలరీకి అనుమతి ఇవ్వలేదని సజ్జల తెలిపారు. మద్యంలో విషం కలుపుతున్నారని నిత్యం ఆరోపణలు చేయడం దారుణమన్నారు. వారి ప్రభుత్వ హయాంలోనే ఎన్నో బ్రాండ్లను తీసుకువచ్చిన విషయం మరిచిపోయారా అని ప్రశ్నించారు. ఇక ల్యాప్టాప్ల విషయంలో పచ్చ మీడియా అబూత కల్పనలు రాస్తుందన్నారు. ల్యాప్టాప్లు ఇవ్వకుంటే ప్రశ్నించాలి కానీ, దానికి సరిపడా డబ్బు ఇస్తే కూడా ల్యాప్టాప్లకు మంగళం అంటూ రాతలు రాయడం మా ప్రభుత్వంపై ఉన్న కోపం తప్పా మరోటి కాదన్నారు.