అమరావతి: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా జగన్ టెన్యూర్పై వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి క్లారిటీ ఇచ్చారు. పార్టీ అధ్యక్షుడిగా ఆయన ఐదేండ్లే ఉంటారని చెప్పారు. జీవితకాలం అధ్యక్ష పదవిని చేపట్టేందుకు జగన్ తిరస్కరించారని ఆయన తెలిపారు. పార్టీ అధ్యక్ష పదవికి ఎవరూ శాశ్వతంగా ఉండరని, దీనిపై ప్రజలకు మీడియా ద్వారా వివరణ ఇవ్వాలని కేంద్ర ఎన్నికల కమిషన్ బుధవారం వైసీపీ ప్రధాన కార్యదర్శిని ఆదేశించిన విషయం తెలిసిందే.
వైసీపీ అధ్యక్షుడిగా ప్రస్తుతానికి జగన్ ఉంటారని సజ్జల రామకృష్ణారెడ్డి స్పష్టం చేశారు. నిజానికి పార్టీ శాశ్వత అధ్యక్ష పదవిని స్వీకరించడం జగన్కు సుతారమూ ఇష్టం లేదని, అందుకే ఆ పదవిని చేపట్టేందుకు జగన్ తిరస్కరించారని చెప్పారు. అందుకే శాశ్వత అధ్యక్షుడి అంశం ప్లీనరీ మినిట్స్లోకి ఎక్కలేదని తెలిపారు. అందువల్ల పార్టీకి శాశ్వత అధ్యక్షుడు ఎవరూ లేరని పేర్కొన్నారు.
జగన్ శాశ్వత అధ్యక్షుడిగా అంగీకరించకపోవడంతో ఆయన ఐదేండ్ల కాలానికి మాత్రమే ఆ పదవిలో ఉంటారని సజ్జల తెలిపారు. ఆ తర్వాత తిరిగి ఎన్నిక జరుగుతుందని చెప్పారు. ఇదే విషయాన్ని కేంద్ర ఎన్నికల సంఘానికి తెలిపినట్లు సజ్జల వెల్లడించారు. దీనిపై స్పష్టత ఇవ్వాలని కేంద్ర ఎన్నికల సంఘం అడిగిన మాట వాస్తవమేనని, అందుకు సంబంధించి వివరణను కమిషన్ కు పంపామని సజ్జల తెలిపారు.