హైదరాబాద్, జూన్ 29 (నమస్తే తెలంగాణ): ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శ్రీశైలం ఆలయంలో మల్లికార్జునస్వామికి సహస్ర ఘటాభిషేకం శాస్ర్తోక్తంగా ప్రారంభమైంది. స్వామివారి ఘటాభిషేక పూజలో ఆంధ్రప్రదేశ్ మంత్రి కొట్టు సత్యనారాయణ, దేవాదాయశాఖ కమిషనర్ సత్యనారాయణ పాల్గొన్నారు. పాతాళగంగ నుంచి పవిత్ర జలాలను తీసుకొచ్చి స్వామివారిని అభిషేకించారు.
అభిషేకం పూర్తయిన తర్వాత మహా నివేదన, నీరాజనం, మంత్రపుష్ప కార్యక్రమాలు నిర్వహించారు. అభిషేక సమయంలో అర్జిత సేవలన్నీ నిలిపివేశారు. దర్శనాలను కూడా తాత్కాలికంగా రద్దు చేశారు. ఈ నెల 30న వేకువజామున గర్భాలయంలోని జలాన్ని తొలగించి యథావిధిగా ఆలయ కైంకర్యాలు కొనసాగిస్తామని అధికారులు తెలిపారు.