అమరావతి : ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు వారిని ఆదుకోవాల్సిన బాధ్యత ప్రజాప్రతినిధులదేనని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. ప్రజలను పట్టించుకోని పాలకులకు తగిన బుద్ధి చెప్పాలని ఆయన పిలుపునిచ్చారు. వరద ప్రభావిత గ్రామాల్లో రెండురోజుల పర్యటన సందర్భంగా గురువారం పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట నియోజకవర్గం ఇలపర్రు వద్ద వరద ముంపు గ్రామాల్లో చంద్రబాబు పర్యటించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి బాదులే బాదుడు పేరిట పన్నులు, నిత్యవసర ధరలు పెంచుతూ సామాన్యుల నడ్డి విరిచారని దుయ్యబట్టారు. దేశంలోనే అధిక ధరలు ఉన్న రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అని తెలిపారు. అప్పులు చేసిన రాష్ట్రం కూడా ఏపీనే అని అన్నారు. కేంద్రం పంపిస్తున్న బియ్యంను వైసీపీ ప్రభుత్వం పేదలకు పంపిణీ చేయడం లేదని విమర్శించారు.