తిరుపతి: ఏపీలో అక్రమ మద్యం రవాణాపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. ఇటీవల అన్నమయ్య జిల్లా రాయచోటి పోలీసులు రూ.72 లక్షల విలువైన మద్యం బాటిళ్లను ధ్వంసం చేయగా.. తాజాగా తిరుపతి పోలీసులు రూ.68 లక్షల విలువైన మద్యం బాటిళ్లను రోడ్డు రోలర్తో తొక్కించారు. రేణిగుంట మండలం గాజులమండ్యం-తాండ్లం మార్గంలో చిన్నచెరువు వద్ద మద్యం సీసాల ధ్వంసం కార్యక్రమాన్ని చేపట్టారు. మద్యం సీసాలను పగలగొట్టడాన్ని సూచి మహిళలు సంతోషం వ్యక్తం చేయగా.. మందుబాబులు మాత్రం ఉసూరుమన్నారు.
వివిధ ప్రాంతాల నుంచి ఏపీకి రవాణా చేస్తుండగా పట్టుకున్న 32,341 మద్యం బాటిళ్లను తిరుపతి పోలీసులు ధ్వంసం చేశారు. ప్రత్యేక ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో (ఎస్ఈబీ), లోకల్ పోలీసులు ఈ బాటిళ్లను పొరుగున ఉన్న తమిళనాడు రాష్ట్రం నుంచి, జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల్లోని బెల్ట్ షాపు నిర్వాహకుల నుంచి రవాణా చేస్తుండగా స్వాధీనం చేసుకున్నారు. ధ్వంసం చేసిన మద్యం విలువ రూ.68 లక్షల వరకు ఉంటుందని పోలీసులు తెలిపారు. జిల్లా పోలీసు సూపరింటెండెంట్ పీ పరమేశ్వర్ రెడ్డి, అదనపు ఎస్పీ అండ్ ఎస్ఈబీ జాయింట్ డైరెక్టర్ ఈ సుప్రజ, ఎస్ఈబీ సూపరింటెండెంట్ స్వాతి సమక్షంలో బాటిళ్లను ధ్వంసం చేసే ఆపరేషన్ జరిగింది.
ఈ సందర్భంగా ఎస్పీ పరమేశ్వర్రెడ్డి మాట్లాడుతూ.. ఇతర రాష్ట్రాల నుంచి మద్యం రవాణా చేస్తూ తమ భవిష్యత్తును పూర్తిగా నాశనం చేసే అక్రమాలకు పాల్పడవద్దని ప్రజలకు, ముఖ్యంగా యువతకు సూచించారు. గ్రామీణ ప్రాంతాల్లోని బెల్ట్ షాపు నిర్వాహకులకు వార్నింగ్ ఇస్తూ, బెల్ట్ షాపులు నిర్వహించడం కూడా నేరమని, గ్రామాల ప్రజలు తమ ప్రాంతంలో ఉన్న బెల్ట్ షాపుల గురించి డయల్ 100 ద్వారా పోలీసులకు సమాచారం అందించాలని, ఇన్ఫార్మర్ వివరాలను గోప్యంగా ఉంచుతామని తెలిపారు. తమిళనాడు నుంచి అక్రమ మద్యం రవాణాను అరికట్టేందుకు బోర్డర్ ఏరియాల్లోని ఎంట్రీ పాయింట్ల వద్ద ఎస్ఈబీ, పోలీసు అధికారులు సోదాలు ముమ్మరం చేయాలని ఎస్పీ సూచించారు. ఎస్ఈబీ గూడూరు సూపరింటెండెంట్ రాజ్ కుమార్, ఎక్సైజ్ అసిస్టెంట్ సూపరింటెండెంట్లు శ్రీనివాసరావు (తిరుపతి), జానకిరామ్ (గూడూరు), సీఐ ఆరోహణరావు తదితరులు పాల్గొన్నారు.