నెల్లూరు: నెల్లూరు జిల్లా చిల్లకూరు మండలం చెడిమళ్ల వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే చనిపోయారు. ఆటోను ఢీకొట్టిన లారీ, ఆటోను కొద్ది దూరం వరకు ఈడ్చుకెళ్లడంతో ఆటో నుజ్జునుజ్జయింది. ప్రమాదంలో ఒకరు ఆటోలో చిక్కుకుని చనిపోగా.. మరో ఇద్దరు లారీ చక్రాల కింద నలిగిపోయారు.
ప్రమాదానికి సంబంధించి స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. చింతవరం నుంచి గూడూరు వైపు వెళ్తున్న ఆటోను వరగలి క్రాస్ రోడ్డు నుంచి చింతవరం వైపు నుంచి వస్తున్న లారీ ఢీకొట్టింది. లారీ చాలా వేగంగా ఉండటంతో ఆటోను కొంత దూరం వరకు లాక్కెళ్లింది. దాంతో ఆటో నుజ్జునుజ్జుగా తయారైంది. గూడూరు సొసైటీ ప్రాంతానికి చెందిన ఆటోడ్రైవర్ సుధాకర్ ఆటోలో ఇరుక్కుని మృతి చెందాడు. మరో ఇద్దరు లారీ చక్రాల కింద పడి చనిపోయారు.
మృతులను గూడూరు మండలం చెన్నూరు దళితవాడకు చెందిన మాతంగి రాజశేఖర్, హరిసాయిగా గుర్తించారు. స్థానికంగా ఒక ఏజెన్సీలో పనిచేస్తున్న వీరు కంపెనీకి చెందిన సరుకులను షాపులకు తిరిగి వేస్తుంటారు. అలా వెళ్తున్న క్రమంలోనే లారీ వీరి ఆటోను ఢీకొట్టింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మూడు మృతదేహాలను పోస్ట్మార్టం నిమిత్తం ప్రభుత్వ దవాఖానకు తరలించారు. మృతుడి బంధువులు సంఘటనా స్థలంలో కన్నీరుమున్నీరుగా విలపించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.