అమరావతి : రోగుల వద్ద వసూలు చేసే డబ్బులు సరిపోక ఓ ఆర్ఎంపీ డాక్టర్ రైలు ప్రయాణికులను దోచుకోవడం అలవాటుగా మార్చుకుని చివరికి గుంటూరు పోలీసులకు చిక్కి కటకటాలపాలయ్యాడు. గుంటూరు జిల్లా రేపల్లెకు చెందిన శ్రీనివాసరావు అనే ప్రయాణికుడు గత నెల 28న కాచీగూడ ఎక్స్ప్రెస్ రైలు ఎక్కి గుంటూరుకు బయలు దేరాడు. గుంటూరులో రైలు దిగే సమయంలో నగదుతో కూడిన బ్యాగ్ కనిపించకపోవడంతో జీఆర్పీ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్న సమయంలో పోలీసులను చూసి పారిపోతున్న బాపట్ల జిల్లా భట్టిప్రోలుకు చెందిన ప్రవీణ్ను పట్టుకుని విచారించారు. అతడి వద్ద ఉన్న రూ. 4 లక్షల గురించి వాకబు చేయగా ప్రయాణికుడి వద్ద దోచుకున్న సొమ్ములో నుంచి రూ. 4లక్షలు ఖర్చుచేయగా మిగతా రూ. 4 లక్షలు ఉన్నాయని అంగీకరించడంతో అతడిపై కేసు నమోదు చేసి జైలుకు పంపారు. తాను ఆర్ఎంపీ డాక్టర్గా పనిచేస్తానని సరదాలకు డబ్బులు సరిపోక దొంగతనానికి పాల్పడుతున్నట్లు అంగీకరించాడని జీఆర్పీ సీఐ వెంకటేశ్వర్లు తెలిపారు.