విజయవాడ: ఏపీ ఈఏపీసెట్ అర్హత పరీక్ష కనీస మార్కుల్లో సడలింపు ఇచ్చారు. కరోనా నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నది. ఈ మేరకు eapcet-sche.aptonline.in లో నోటీసు జారీ చేశారు. ఆంధ్రప్రదేశ్లో ఇంజినీరింగ్, ఫార్మా డీ కోర్సుల్లో ప్రవేశాల నిమిత్తం ఈఏపీసెట్ ద్వారా కౌన్సెలింగ్ జరిపేందుకు ఏర్పాట్లు చేశారు.
కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఇంటర్ చదువులు సాధారణంగా కొనసాగడంతో ఇంజినీరింగ్, ఫార్మా డీ కోర్సుల్లో ప్రవేశాలకు అర్హత పరీక్షలో కనీస మార్కులను ప్రభుత్వం సడలించింది. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వులు ప్రస్తుత విద్యా సంవత్సరానికి మాత్రమే అమలులో ఉంటాయి. ఈ సడలింపు ఆధారంగా జనరల్ క్యాటగిరీలోని అభ్యర్థులు ఇంజినీరింగ్ లేదా ఫార్మసీ ప్రోగ్రాంలలో ప్రవేశాలకు అర్హులుగా పరిగణించేందుకు ఇంటర్ 1, 2 వ సంవత్సరం పరీక్షల్లో అన్ని సబ్జెక్టుల్లో 45 శాతం మార్కులను పొందవలసి ఉంటుంది. రిజర్వ్డ్ క్యాటగిరీల్లోని విద్యార్థులకు ఉత్తీర్ణత శాతం 40 శాతంగా ఉండాలి.
అయితే, ఈ నిబంధన ప్రకారం అన్ని సబ్జెక్టుల్లోని మార్కులను పరిగణలోకి తీసుకోవడం లేదు. ఇంటర్లో సాధారణ అభ్యర్థులు 45 శాతం మార్కులతో, పీసీఎంలో రిజర్వ్ చేయబడిన అభ్యర్థులు 40 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించి ఈఏపీసెట్లో పాసైన వారు కౌన్సెలింగ్కు హాజరుకావాల్సి ఉంటుంది. సవరించిన ప్రమాణం ప్రకారం, విద్యార్థులు ఇంటర్ పరీక్షల్లో పీసీఎంలో మొత్తం 45 శాతం స్కోర్ చేయాల్సి ఉంటుంది. ఇంటర్ 1, 2 వ ఏడాది పరీక్షల్లో అన్ని సబ్జెక్టుల్లో 45 శాతం మార్కులు తప్పనిసరిగా పొందాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఏపీలో ఈఏపీసెట్ కౌన్సెలింగ్ ప్రక్రియ కొనసాగుతున్నది. సర్టిఫికేట్ వెరిఫికేషన్ దరఖాస్తు చేసుకునేందుకు, రిజిస్ట్రేషన్ కోసం చెల్లింపులకు ఇవాల్టి వరకు అనుమతి ఉన్నది. వెబ్ ఆప్షన్ల ఫిల్లింగ్ తేదీలను త్వరలో ఏపీ సాంకేతిక విద్యాశాఖ తెలియజేయనున్నది.