Groom Died before First Night | ఇంటి ముందు కట్టిన తోరణాలు వాడలేదు.. కాళ్లకు పెట్టిన పారాణి ఆరలేదు.. పెళ్లి తంతు ఇంకా పూర్తే కాలేదు.. అప్పుడే పెళ్లింట చీకట్లు అలుముకున్నాయి. నూరేళ్ల జీవితాన్ని ఎంతో అందంగా ఊహించుకున్న నవ వధువు కలలు కళ్లలయ్యాయి. శోభనం గదిలోనే పెండ్లి కొడుకు కన్నుమూశాడు. ఈ విషాద ఘటన అన్నమయ్య జిల్లా మదనపల్లెలో చోటుచేసుకుంది.
వివరాల్లోకి వెళ్తే.. పాకాల మండలం కట్టికందపల్లెకు చెందిన తులసీ ప్రసాద్.. మదనపల్లె జిల్లా చంద్రాకాలనీకి చెందిన యువతి ప్రేమించుకున్నారు. వీరి పెళ్లికి పెద్దలు కూడా అంగీకరించారు. దీంతో సోమవారం ( ఈ నెల 12వ తేదీన) ఘనంగా వివాహం జరిపించారు. అదే రోజు రాత్రి శోభనం ముహూర్తం ఉండటంతో వధూవరులు ఇద్దరూ యువతి ఇంటికి వెళ్లారు. అక్కడే అన్ని ఏర్పాట్లు చేశారు. శోభనం గదిలోకి ముందుగా తులసీ ప్రసాద్ను పంపించారు. కాసేపటికి వధువును లోపలికి పంపించారు. కానీ ఎన్నో ఆశలతో శోభనం గదిలోకి అడుగుపెట్టిన ఆ వధువుకు దిగ్భ్రాంతికి గురయ్యే దృశ్యం కనిపించింది. బెడ్పై నిర్జీవంగా పడి ఉన్న తులసీప్రసాద్ను చూసి టెన్షన్కు గురైంది. ఎంత లేపినా లేవకపోవడంతో కంగారుపడి విషయాన్ని పెద్దలకు చెప్పింది. వారు వెంటనే తులసీప్రసాద్ను ఆస్పత్రికి తరలించారు. అక్కడ అతన్ని పరీక్షించిన వైద్యులు.. అప్పటికే మరణించినట్లు నిర్ధారించారు. పెండ్లయి 24 గంటలు కూడా అవ్వకముందే వరుడు మరణించడంతో ఇరు కుటుంబాల్లో విషాదం నెలకొంది. నవ వధువు శోకసంద్రంలో మునిగిపోయింది.