విజయవాడ: రాష్ట్ర రాజధానిగా అమరావతిపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు స్పష్టమైన తీర్పు చెప్పిందని పీఏసీ ఛైర్మన్ పయ్యావుల కేశవ్ అభిప్రాయపడ్డారు. అయినప్పటికీ జగన్ ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్లడంలో మతలబు రాజకీయ ఎత్తుగడే అని చెప్పారు. రానున్న ఎన్నికల్లో మూడు రాజధానులంటూ ప్రజలను మభ్యపెట్టి ఓట్లు గుంజుకోవడానికే ఇలాంటి చౌకబారు ఎత్తుగడకు దిగిందని ఆయన విమర్శించారు. ప్రస్తుత హైకోర్టు చీఫ్ జస్టిస్కు రాష్ట్ర ప్రభుత్వ అవినీతిపై అవగాహన ఉన్నట్లు తాను నమ్ముతున్నానన్నారు.
శాసనసభకు ఉన్నటువంటి పరిమితులపై ఏపీ హైకోర్టు తీర్పు చెప్పిన విషయాన్ని పయ్యావుల గుర్తుచేశారు. కేంద్రం ఒకసారి నిర్ణయం తీసుకున్నాక రాజధానిని మార్చే అధికారం రాష్ట్రాల శాసనసభకు లేదని, పార్లమెంటుకు మాత్రమే అలాంటి అధికారం ఉందని హైకోర్టు చెప్పిన విషయాన్ని మరిపోయారా అని ప్రశ్నించారు. 90 రోజుల్లో పిటిషన్ వేయాల్సి ఉన్నా.. కేవియట్ పిటిషన్లు దాఖలైన విషయం తెలిసి కూడా 6 నెలల తర్వాత ఎస్ఎల్పీకి వెళ్లడం వెనక మర్మమేంటో ప్రభుత్వమే చెప్పాలన్నారు. హైకోర్టు తీర్పు వెలువడిన ఆరు నెలల తర్వాత సుప్రీంకోర్టుకు వెళ్లడంలో ఆంతర్యమేంటని ప్రశ్నించారు. ఎన్నికల వరకూ ఇదే తంతును ఈ ప్రభుత్వం కొనసాగిస్తుందని, సుప్రీంకోర్టులో ఎన్నికల వరకూ తీర్పు రాకుండా ఎత్తుగడలు వేస్తుందని పయ్యావుల కేశవ్ అభిప్రాయపడ్డారు.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం హయాంలో జరుగుతున్న అవినీతిపై ప్రస్తుత చీఫ్ జస్టిస్కు సంపూర్ణమైన అవగాహన ఉన్నట్లుగా తాను నమ్ముతున్నానని కేశవ్ చెప్పారు. ఓబులాపురం కేసులో కూడా అవగాహన ఉంటుందని భావిస్తున్నానన్నారు. ఉత్తరాంధ్రలో తన అవినీతితోనే జగన్ అడ్రస్ గల్లంతైందని తెలిపారు. ధర్మం రైతుల పక్షాన నిలుస్తుందని తాను ఇప్పటికీ, ఎప్పటికీ నమ్ముతానని పేర్కొన్నారు. అసెంబ్లీలో ప్రభుత్వం రాజధానుల బిల్లు పెడుతుందని తాననుకోవడం లేదని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో రాయలసీమ, ఉత్తరాంధ్రల్లో లబ్ధి పొందే ప్రయత్నంలో భాగంగానే ఇలాంటి నాటకాలకు తెరలేపారని విమర్శించారు. ఏపీ ఆర్థిక వ్యవస్థ బాగుందని సీఎం జగన్ చెప్పడాన్ని పయ్యావుల కేశవ్ తీవ్రంగా దుయ్యబట్టారు. ఆర్థిక పరిస్థితి బాగుంటే నిధుల కోసం కేంద్రాన్ని ఎందుకు దేబరిస్తున్నారని ప్రశ్నించారు.