అనంతపురం జిల్లా : రామగిరి బంగారు గనుల కోసం త్వరలో టెండర్లు ఖరారు కానున్నాయి. ఈ నెలాఖరుకల్లా టెండర్లు ఖరారయ్యే అవకాశాలున్నాయి. మొత్తం 10 బ్లాక్ల బంగారు గనుల కోసం కేంద్ర ప్రభుత్వం టెండర్లను ఆహ్వానిస్తున్నది. టెండర్ దశ పూర్తికాగానే ఈ గనుల్లో బంగారం తవ్వకం కార్యకలాపాలు ప్రారంభమవుతాయి. భారీ నష్టాల కారణంగా రెండు దశాబ్దాల క్రితం రామగిరి బంగారు గనులను కేంద్ర ప్రభుత్వం మూతవేసింది. ఈ బంగారం గనులు అనంతపురం జిల్లా రామగిరి, సత్యసాయి జిల్లా రొద్దం మండలంలో ఉన్నాయి.
రాష్ట్రాలు, మైనింగ్ కంపెనీలు, ప్రైవేట్ రంగాలతో విస్తృతమైన సంప్రదింపుల అనంతరం 2015లో మైనింగ్ చట్టానికి చేసిన సవరణలు చేపట్టారు. ఫలితంగా ఉత్తర ప్రదేశ్లో మూడు, ఆంధ్రప్రదేశ్లో 10 బంగారు గనులు.. మొత్తం 13 బంగారు గనుల్లో తవ్వకాలను తిరిగి ప్రారంభం కానున్నది. రామగిరి ఆర్పీ బ్లాక్లో 13 కి.మీ పొడవున్న రామగిరి గోల్డ్ ఫీల్డ్ (ఆర్జీఎఫ్) ఉన్నది. ఈ ప్రాంతంలో బ్రిటిష్ పాలకులు పెద్ద మొత్తంలో మైనింగ్ చేపట్టారు. 1910 నుంచి 1927 వరకు హై-గ్రేడ్ సిరల నుంచి రికవరీ గ్రేడ్ 15 జీ/టీతో 1,76,338 ఔన్సుల బంగారాన్ని ఉత్పత్తి చేశారు. ఏప్రిల్ 2001 వరకు భారత ప్రభుత్వ యాజమాన్యంలోని భారత్ గోల్డ్ మైన్స్ లిమిటెడ్ (బీజీఎంఎల్) ఆర్జీఎఫ్లో భూగర్భ గనిని నిర్వహించింది. అయితే, ఈ గనులు లాభాల కంటే రెట్టింపు నష్టాలు చవిచూడటంతో ఈ గనులను మూసివేశారు.
ప్రైవేట్ సంస్థలను ప్రోత్సహించడంలో భాగంగా 2015 లో తీసుకున్న నిర్ణయం ప్రకారం అనంతపురం జిల్లా రామగిరి మండలం, సత్యసాయి జిల్లా రొద్దం మండలం బొక్కాస్మపల్లెలో 10 బ్లాకులకు కేంద్ర ప్రభుత్వం టెండర్లను ఆహ్వానించింది. అమెరికాకు చెందిన మల్టీ-నేషనల్ కంపెనీ రామగిరి ప్రాంతంలో తవ్వకాల సాధ్యాసాధ్యాలను పరిశీలించేందుకు ఇటీవల సర్వే కూడా నిర్వహించింది. 10 బ్లాకులకు గ్లోబల్ టెండర్లు ఆహ్వానించగా, వాటిలో 5 బ్లాకుల నిర్ణయాన్ని ఆగస్టు చివరి నాటికి మొదటి దశలో ఖరారు చేయనున్నట్లు అధికారిక వర్గాలు చెప్తున్నాయి.