తాడేపల్లి : రాఖీపౌర్ణమి పురస్కరించుకుని ఏపీ సీఎం జగన్ మహిళలకు శుభాకాంక్షలు తెలిపారు. రాఖీ పండుగ సందర్భంగా తాడేపల్లిలోని ముఖ్యమంత్రి కార్యాలయంలో వేడుకలు జరిగాయి. మహిళా మంత్రులు పలువురు సీఎం జగన్కు రాఖీలు కట్టారు. అనంతరం మిఠాయిలు తినిపించారు. జగన్మోహన్రెడ్డికి రాఖీలు కట్టిన వారిలో మంత్రులు తానేటి వనిత, విడదల రజనితో పాటు మహిళా కమిషన్ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ, విజయవాడ మేయర్ భాగ్యలక్ష్మి ఉన్నారు. ఏపీ సీఎం జగన్కు బ్రహ్మకుమారీలు కూడా వచ్చి రాఖీలు కట్టారు. ఈ సందర్భంగా బ్రహ్మకుమారీలకు సీఎం జగన్ రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు తెలిపారు.
అంతకుముందు ట్విట్టర్ ద్వారా ‘రాష్ట్రంలోని ప్రతి అక్కకు, ప్రతి చెల్లెమ్మకు.. ప్రతి ఒక్క పాపకు, ప్రతి ఒక్క మహిళకు రాఖీ శుభాకాంక్షలు‘ తెలిపారు. రక్షాబంధనం అనేది ఆత్మీయతలు, అనురాగాల పండుగ అని, ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా, విద్యాపరంగా, రక్షణపరంగా మహిళలకు మంచి చేసే విషయంలో దేశంలోనే ముందున్న మనందరి ప్రభుత్వానికి రాష్ట్రంలోని అక్కచెల్లెమ్మలందరి చల్లని దీవెనలు, దేవుడి ఆశీస్సులు కలకాలం లభించాలని కోరుకుంటున్నాను అని పేర్కొన్నారు.