తిరుమల: తిరుపతిలో నాలుగు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలు గడిచిన 30 సంవత్సరాల్లో ఎప్పుడూ కురవలేదని టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. ఈ భారీ వర్షాలకు శేషాచలం కొండల్లోని డ్యాములు, చెక్డ్యామ్లు పొంగి పొర్లి కపిల తీర్థం జలపాతం గుండా తిరుపతి నగరంలోని పలు ప్రాంతాలను ముంచేశాయని ఆయన చెప్పారు. వర్షాల వల్ల తిరుమలలో 4 కోట్లకు పైగా ఆస్తి నష్టం జరిగిందని వెల్లడించారు.
మొదటి ఘాట్ రోడ్ లోని అక్కగార్ల గుడి వద్ద రక్షణ గోడ దెబ్బతిని, ఘాట్ రోడ్ లో నాలుగు ప్రాంతాల్లో కొండ చరియలు విరిగిపడ్డాయన్నారు. టీటీడీ సిబ్బంది, అధికారులు యుద్ధ ప్రాతిపదికన రంగంలోకి దిగి వీటిని తొలగించి, తాత్కాలిక రక్షణ ఏర్పాట్లతో ట్రాఫిక్ను పునరుద్ధరించారని ఆయన చెప్పారు. రెండవ ఘాట్ రోడ్లో 13 ప్రాంతాల్లో కొండచరియలు విరిగి పడ్డాయని తెలిపారు. ఐదు ప్రాంతాల్లో రక్షణ గోడలు దెబ్బతిన్నాయన్నారు.
టీటీడీ అధికారులు, సిబ్బంది ఈ ఘాట్ రోడ్డులో కూడా కొండ చరియలను తొలగించి ట్రాఫిక్ను పునరుద్ధరించారని చెప్పారు. తిరుమల నారాయణగిరి గెస్ట్ హౌస్ను ఆనుకొని ఉన్న రక్షణ గోడ పడిపోవడంతో మూడు గదులు దెబ్బతిన్నాయన్నారు. ఈ క్రమంలోనే నారాయణ గిరి, ఎస్వీ అతిథి గృహాల్లోని యాత్రికులను ముందు జాగ్రత్తగా ఇతర ప్రాంతాలకు తరలించినట్లు చైర్మన్ వివరించారు. శ్రీవారి మెట్టు మార్గంలో కొంతమేరకు రోడ్డు, కొంతమేరకు ఫుట్ పాత్ దెబ్బతిన్నాయన్నారు.
తిరుపతిలోని టీటీడీ పరిపాలన భవనం వెనుక వైపు ఉన్న గోడతో పాటు, రాంనగర్, వినాయక నగర్, జిఎంబి క్వార్టర్స్, శ్రీనివాసం విశ్రాంతి గృహం కాంపౌండ్ వాల్స్ దెబ్బ తిన్నట్లు ఆయన తెలిపారు. కపిలతీర్థం ఆలయంలో ఒక మండపం వర్షాలకు దెబ్బతిందని, దీని మరమ్మతులకు రూ.70 లక్షల రూపాయలు ఖర్చు కావచ్చని అధికారులు అంచనా వేసిన విషయాన్ని టీటీడీ ఛైర్మన్ వెల్లడించారు. వర్షం వల్ల టీటీడీ సర్వర్లు దెబ్బతిని సేవలకు అంతరాయం కలిగిందన్నారు.
ఐటీ విభాగం అధికారులు, సిబ్బంది ఈ విషయంలో వెంటనే స్పందించిన, సేవలను పునరుద్ధరించారని ఆయన చెప్పారు. స్వామివారి దర్శనం కోసం వచ్చి భారీ వర్షాల కారణంగా తిరుపతిలో ఆగిపోయిన భక్తులకు శ్రీనివాసం, మాధవం, రెండు, మూడు సత్రాల్లో వసతి, ఆహారం ఏర్పాటు చేశామన్నారు.
టికెట్లు ఉండి దర్శనానికి రాలేక పోయిన భక్తులను వర్షాలు తగ్గాక స్వామివారి దర్శనానికి అనుమతించాలని నిర్ణయం తీసుకున్నామని సుబ్బారెడ్డి ప్రకటించారు. తిరుమల, తిరుపతిలో దెబ్బతిన్న రోడ్లు, ఇతర మరమ్మతులు యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసి యాత్రికులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు.