హైదరాబాద్: బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం తీవ్రవాయుగుండంగా మారింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం మరింత బలపడి శుక్రవారం సాయంత్రానికి వాయుగుండంగా మారిందని వాతావరణ శాఖ వెల్లడించింది. శనివారం ఉదయం 5.30 గంటలకు అది తీవ్రవాయుగుండంగా ఏర్పడిందని తెలిపింది. ప్రస్తుతం అది ఉత్తర, తూర్పు మధ్య బంగాళాఖాతంలో ఉన్నదని పేర్కొన్నది. గోపాల్పూర్కు 510 కిలోమీటర్ల దూరం, కలింగపట్నానికి 590 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉన్నదని వెల్లడించింది.
రాగల 12 గంటల్లో మరింత బలపడి తుఫానుగా మారే అవకాశం ఉందని తెలిపింది. ఆదివారం సాయంత్రానికి ఉత్తరాంధ్ర, ఒడిశా తీర ప్రాంతంలో తీరం దాటనుందని వెల్లడించింది. దీని ప్రభావంతో ఒడిశా, ఉత్తర కోస్తా జిల్లాలకు భారీ వర్షం ఉన్నట్లు సూచించింది.