అనంతపురం: జిల్లాలోని జేఎన్టీయూలో ర్యాగింగ్ కలకలం రేపింది. జూనియర్ విద్యార్థులు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడంతో ర్యాగింగ్ విషయం వెలుగులోకి వచ్చింది. వర్శిటీ చరిత్రలోనే ఏకంగా 18 మంది విద్యార్థులు సస్పెండ్ అయ్యారు. ఈ వ్యవహారంపై ఉన్నత స్థాయి విచారణకు ప్రభుత్వం ఆదేశించింది.
గత కొన్నాళ్లుగా రాష్ట్రంలో ర్యాగింగ్ అనేది వినిపించలేదు. తాజాగా జేఎన్టీయూలో ర్యాగింగ్ జరిగిన విషయం బయటకు రావడంతో సంచలనంగా మారింది. అనంతపురం జేఎన్టీయూలో ర్యాగింగ్ పడగ విప్పింది. బుద్ధిగా చదువుకోవాల్సిన చోట.. ర్యాగింగ్ పేరుతో అడ్డంగా బుక్కయ్యారు. సీనియర్ విద్యార్థులు జూనియర్ల పట్ల అర్ధరాత్రుల్లో వెకిలీగా ప్రవర్తించడం, అలసిపోయేంత వరకు డ్యాన్సులు చేస్తూ అడ్డూఅదుపూ లేకుండా ఆకృత్యాలకు పాల్పడుతున్నారు.
కొన్ని రోజులు సీనియర్ల చేష్టలను భరించిన జూనియర్లు.. ఇటీవల వారి ర్యాగింగ్ విషమించడంతో అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. దీంతో ప్రాథమిక దర్యాప్తు చేపట్టిన వర్శిటీ అధికారులు ర్యాగింగ్కు పాల్పడినట్లు తేలిన 18 మంది విద్యార్థులను సస్పెండ్ చేశారు. జేఎన్టీయూ చరిత్రలో ర్యాగింగ్ పాల్పడ్డారన్న ఆరోపణలతో 18 మంది విద్యార్థులపై సస్పెన్షన్ వేటు పడటం ఇదే మొదటిసారి.