విజయవాడ: ఆరోగ్య విశ్వవిద్యాలయానికి అకారణంగా ఎన్టీఆర్ పేరు తొలగించడంపై ఎన్టీఆర్ కుమార్తె, బీజేపీ నాయకురాలు దగ్గుబాటి పురందేశ్వరి తీవ్రంగా స్పందించారు. ఇది ముమ్మాటికీ ఎన్టీఆర్ను అవమానించడమే అని వ్యాఖ్యానించారు. ఇలా పేరు మార్చడం వెనకున్న ఉద్దేశాలను కూడా ప్రభుత్వం బయటపెడితే సంతోషిస్తామన్నారు. ఆరోగ్య విశ్వవిద్యాలయం పేరు మార్పుపై ఆమె గురువారం విజయవాడలో మీడియాతో మాట్లాడారు.
ప్రజల జీవితాలను మార్పు తెచ్చేందుకు అనేక సంస్కరణలు తెచ్చిన మహానీయుడు ఎన్టీఆర్ అని పురందేశ్వరి కొనియాడారు. అలాంటి వ్యక్తి పేరును తొలగించడం బాధాకరమన్నారు. ప్రభుత్వం తక్షణమే జీఓ వెనక్కి తీసుకునేలా పార్టీలకు అతీతంగా పోరాడాలని ఆమె పిలుపునిచ్చారు. రాజశేఖర్రెడ్డి తక్కువ నాయకుడిగా తాము భావించడం లేదని, ఆయనపట్ల అపారమైన గౌరవం ఉన్నదని చెప్పారు. ప్రజాదరణ కలిగిన గొప్ప నాయకుల్లో వైఎస్సార్ కూడా ఒకరని తెలిపారు. కానీ, ఇవాళ ఆరోగ్య విశ్వవిద్యాలయం పేరు మార్చాల్సిన అవసరం ఏమొచ్చిందని ప్రభుత్వం వివరణ ఇవ్వాలని ఆమె డిమాండ్ చేశారు. ఎలాంటి కారణాలు లేకుండానే యూనివర్శిటీ పేరు మార్చడం అనేది ముమ్మాటికీ ఎన్టీఆర్ను అవమానించడమే అని చెప్పారు.
రుషికొండకు జగన్ కొండ అని పేరు పెడతారేమో అని బీజేపీ సీనియర్ నాయకుడు విష్ణుకుమార్ రాజు ఎద్దేవా చేశారు. ఎన్టీఆర్ పేరు మారుస్తూ తెచ్చిన జీవోను వెనక్కి తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. అలా చేయనిపక్షంలో మీ గొయ్యి మీరే తవ్వుకున్నట్లు అవుతుందన్న విషయం మరిచిపోవద్దన్నారు. ప్రభుత్వాలు మారినప్పుడల్లా ఇలా పేర్లు మార్చుకుంటూ పోవడం ఎంతవరకు సమంజసం అని ప్రశ్నించారు.