అమరావతి : ఆంధ్రప్రదేశ్లోని పల్నాడు జిల్లా రెంటచింతల జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని టీడీపీ అధినేత చంద్రబాబు, జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ ప్రభుత్వాన్ని కోరారు. ఈ ఘటనలో మరణించిన ఏడుగురి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. బాధితులను ప్రభుత్వం ఆదుకోవాలన్నారు.
రెంటచింతల విద్యుత్ సబ్స్టేషన్ వద్ద ఆగి ఉన్న లారీని టాటా ఏస్ వాహనం ఢీకొట్టిన దుర్ఘటనలో ఏడుగురు మరణించారు. ప్రమాదంలో మరో పది మంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను గురజాల ప్రభుత్వ దవాఖానకు తరలించారు. శ్రీశైలం మల్లన్నను దర్శించుకుని రెంటచింతలకు తిరిగివస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ప్రమాద సమయంలో టాటా ఏస్లో 38 మంది ఉన్నారని పోలీసులు చెప్పారు. డ్రైవర్ నిద్రమత్తులో ఉండటంతోనే ఈ ప్రమాదం జరిగిందని ప్రాథమికంగా నిర్ధారించారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తుచేస్తున్నారు.