అమరావతి : కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఈ రోజు అనంతపురం జిల్లాలో పర్యటించారు. జిల్లాలోని గోరంట్ల మండలం పాలసముద్రం వద్ద నాసిన్ అకాడమీ పనుల శంకుస్థాపనకు విచ్చేసిన సందర్భంగా ప్రొటోకాల్ వివాదం జరిగింది. కేంద్ర అధికారులు ప్రొటోకాల్ పాటించడం లేదని ఎంపీ గోరంట్ల మాధవ్ అసంతృప్తి వ్యక్తం చేస్తూ కేంద్ర మంత్రికి ఫిర్యాదు చేశారు. ఆహ్వాన పత్రికలో తన పేరు లేదని పేర్కొన్నారు. సంబంధిత అధికారులపై చర్యలు తీసుకోవాలని ఎంపీ కోరారు.
ప్రజాస్వామ్యంలో పాలకులు నియంతృత్వంతో పోవద్దని సూచించారు. నియోజకవర్గంలోని కరువు ప్రాంతాలను ఆదుకోవాలని, ఏపీ సెంట్రల్ యూనివర్శిటీకి నిధులు ఇవ్వాలని ఆయన కోరారు. కాగా నాసిన్ సంస్థలో భూములు కోల్పొయిన రైతులు మంత్రి పర్యటనను అడ్డుకోకుండా అర్థరాత్రి బాధితులను పోలీసులు అరెస్టు చేశారు. పాలసముద్రంలో కొందరు రైతులను అదుపులోకి తీసుకున్నారు. కేంద్రమంత్రి పర్యటన దృష్ట్యా రైతులు ముందస్తు అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు.