అమరావతి : ప్రధాని నరేంద్ర మోదీ ఏపీ పర్యటనపై నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వకుండా మోదీ మోసం చేస్తున్నారని పేర్కొంటూ వామపక్ష పార్టీ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. ఏలూరు జ్యూట్ మిల్ సెంటర్ లోని అల్లూరి విగ్రహం వద్ద ‘ నరేంద్ర మోదీ గో బ్యాక్’ అంటూ నల్లజెండాలతో నిరసన తెలిపారు. సీపీఎం ఏలూరు జిల్లా కార్యదర్శి బాబురావు, సీపీఐ జిల్లా కార్యదర్శి ప్రభాకర్రావు మాట్లాడుతూ మోదీకి అల్లూరి విగ్రహం ఆవిష్కరించే అర్హత లేదని పేర్కొన్నారు. రేపు భీమవరంలో అల్లూరి విగ్రహాన్ని ఆవిష్కరించేందుకు వస్తున్న మోదీని అన్ని రాజకీయ పార్టీలు, ప్రజాస్వామిక వాదులు వ్యతిరేకించాలని పిలుపునిచ్చారు.
స్వాతంత్య్ర పోరాటంలో ఎలాంటి భాగస్వామ్యమూ లేని బీజేపీ, ఆర్ఎస్ఎస్ అల్లూరి సీతారామరాజు జయంతి ఉత్సవాల్లో కులమతాలు చొప్పించే ప్రయత్నం చేస్తున్నారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ఆరోపించారు. అల్లూరి 125వ జయంతి సందర్భంగా విజయవాడ బాలోత్సవ్ భవన్లో వామపక్షపార్టీలు నిర్వహించిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ప్రస్తుత బీజేపీ పాలన ఎమర్జెన్సీని తలపిస్తోందని అన్నారు. రాష్ట్రానికి ఇవ్వాల్సిన హామీలపై స్పష్టమైన ప్రకటన చేయాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు.
మోదీ పర్యటనను వ్యతిరేకిస్తూ రేపు రాజమహేంద్రవరం నుంచి చలో భీమవరం కార్యక్రమం చేపడుతున్నామని ఏపీసీసీ కార్యదర్శి పరసా రాజీవ్ రతన్ వెల్లడించారు.