తిరుపతి : తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామికి భక్తులు సమర్పించిన ఆస్తులు అన్యాక్రాంతం కాకుండా పటిష్ట చర్యలు చేపడుతున్నట్లు టీటీడీ ఏర్పాటుచేసిన ల్యాండ్ కమిటీ ఛైర్మన్, రిటైర్డ్ జడ్జి జస్టిస్ కే శ్రీధర్ రావు తెలిపారు. దేశవ్యాప్తంగా ఉన్న 975 ఆస్తులను ప్రత్యక్షంగా పరిశీలించి రక్షణ చర్యలు చేపట్టడాన్ని అభినందించారు. తిరుపతిలోని శ్రీ పద్మావతి విశ్రాంతి గృహంలో టీటీడీ నియమించిన ల్యాండ్ కమిటీ సమావేశం జరిగింది.
ఈ సందర్భంగా జస్టిస్ కే శ్రీధర్ రావు మాట్లాడుతూ.. 2021 జనవరి 21 న కమిటీ మొదటి సమావేశం జరిగిందని, ఈ ఏడాదిన్న కాలంలో 29 ప్రాంతాల్లో ఆక్రమణకు గురైన రూ.23 కోట్ల విలువైన 20.45 ఎకరాలను టీటీడీ అధికారులు స్వాధీనం చేసుకున్నారని తెలిపారు. మొత్తం 109 ఆస్తులను లీజుకు ఇవ్వడం ద్వారా టీటీడీకి రూ.4.15 కోట్ల ఆదాయం సమకూరిందన్నారు. జనక్పురి, రిషికేష్, డెహ్రాడూన్ తదితర ప్రాంతాల్లో ఉన్న ఆస్తులను అభివృద్ధి చేసి భక్తులకు ఏ విధంగా ఉపయోగపడేలా చేయాలనే విషయంపై సమావేశంలో చర్చించామని పేర్కొన్నారు. ఆక్రమణలకు గురికాకుండా ఉండేందుకు ఆస్తులన్నింటికీ జియో మ్యాపింగ్ చేయాలని నిర్ణయించామని చెప్పారు. కల్యాణమండపాలను లీజుకు ఇవ్వడం ద్వారా రూ.6 కోట్ల ఆదాయం లభించిందన్నారు. టీటీడీ ఆస్తులకు రక్షణ చర్యలు చేపట్టి పర్యవేక్షించేందుకు టాస్క్ఫోర్స్ బృందాలను ఏర్పాటుచేసినట్లు వెల్లడించారు. తమిళనాడులోని తంజావూరు జిల్లా కపిస్థలంలో 100 ఏండ్ల క్రితం ఓ భక్తుడు కానుకగా సమర్పించిన 6 ఎకరాల స్థలాన్ని ఇటీవల స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు.
ఈ సమావేశంలో కమిటీ సభ్యులు డా వీఆర్ గౌరీశంకర్, హైదరాబాద్ స్థానిక సలహా మండలి ఛైర్మన్ జీవీ భాస్కర్రావు, చెన్నై స్థానిక సలహా మండలి ఛైర్మన్ ఏజే శేఖర్, ముంబై స్థానిక సలహా మండలి ఛైర్మన్ అమోల్ కాలే, బెంగళూరు స్థానిక సలహా మండలి ఛైర్మన్ డాక్టర్ సంపత్ రవినారాయణ, న్యూఢిల్లీ స్థానిక సలహా మండలి ఛైర్మన్ శ్రీమతి వీ ప్రశాంతిరెడ్డి, భువనేశ్వర్ స్థానిక సలహా మండలి ఛైర్మన్ దుష్మంత్కుమార్ దాస్, బయ్యా శ్రీనివాసులు, డాక్టర్ కే రామచంద్రమూర్తి, గోవిందహరి, తదితరులు పాల్గొన్నారు.